ఏపీ మాకు పోటీనే కాదు: అమరావతి చింత అసలే లేదు: మాదంతా వేరే లెవెల్- రేవంత్ రెడ్డి
CM Revanth Reddy visits Davos: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన దావోస్ పర్యటన.. అద్భుత ఫలితాలను అందిస్తోంది. భారీ విస్తృతంగా భారీ పెట్టుబడులను సాధిస్తోంది. పలు కీలక రంగాల్లో ఆయా సంస్థలతో ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటోంది.
మరో ఐటీ సెంటర్..
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అనంతరం ఈ కీలక ప్రకటన విడుదల చేశారు.

పోరుగు రాష్ట్రాలు పోటీనే కాదు..
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మనీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో పొరుగు రాష్ట్రాలు తనకు పోటీనే కాదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తోటి రాష్ట్రాలతో పోటీ పడదలచుకోలేదని స్పష్టం చేశారు.
న్యూయార్క్, టోక్యో..
న్యూయార్క్, టోక్యో లేదా సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడదలచుకున్నానని ఆయన వివరించారు. అందుకే మల్టీ నేషనల్ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తోన్నానని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ రంగ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోన్నానని చెప్పారు.
పెట్టుబడులకు సురక్షితం..
ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉంటోన్నాయని, తెలంగాణ ప్రత్యేకత ఏమిటంటూ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ ఎంతో సురక్షితమైన ప్రదేశమని రేవంత్ రెడ్డి చెప్పారు.

తొలి ప్రాధాన్యత..
తెలంగాణ అంటేనే వ్యాపారాత్మక రాష్ట్రామని, భారత్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొలి ప్రాధాన్యత తెలంగాణ, హైదరాబాదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతోమంది నిపుణులు, అద్భుతమైన విద్యా వ్యవస్థ అక్కడ ఉందని, పైగా భారత్కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటోందని అన్నారు. అంతర్జాతీయంగా అద్భుత కనెక్టివిటీని హైదరాబాద్ కలిగివుందని చెప్పారు.
డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల రంగాలు..
డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల రంగాలకు చెందిన పెట్టుబడులపై తాము దృష్టి సారించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ, ఫార్మారంగాల్లో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి శ్రమిస్తోన్నామని, ఈ క్రమంలోనే అధిక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అప్పులను పూడ్చుకోవచ్చనీ అన్నారు.

అమరావతి..హైదరాబాద్తో పోటీ
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్, హైటెక్ సిటీ, మదాపూర్ వంటివి అభివృద్ధి చెందాయని, ఇప్పుడు అదే చంద్రబాబు హయాంలో అమరావతి కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చెంది హైదరాబాద్తో పోటీ పడుతుందని భావిస్తున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి- నో అంటే సమాధానం ఇచ్చారు.
ఏ మెట్రో సిటీ కూడా..
ఏపీకి హైదరాబాద్ లేదని, తమ రాష్ట్రానికి ఉందని గుర్తు చేశారు. హైదరాబాదే తన ప్రధాన బలమని తేల్చి చెప్పారు. ఐఎస్బీ వంటి అత్యున్నత విద్యా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పారు. ఒక్క అమరావతి అనే కాకుండా- ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కత వంటి ఏ మెట్రోపాలిటన్ సిటీ కూడా హైదరాబాద్తో పోటీ పడలేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications