‘కాపీ’చేయాల్సిన ఖర్మేంటి?: తెలంగాణపై ఏపీ ఫైర్
హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల మధ్య 'కాపీ' వివాదం తీవ్రమవుతోంది. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు సంబంధించి తమ విధానాలను పూర్తిగా కాపీ కొట్టిందని తెలంగాణ చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు ఈ విషయంలో గత సంవత్సరం దేశంలోనే నెంబర్ 2 స్థానంలో ఉన్న తాము తెలంగాణ విధానాలను కాపీ కొట్టాల్సిన ఖర్మ తనకేంటని కూడా ఏపీ చెప్పుకొస్తోంది
ఈ మేరకు మంగళవారం తెలంగాణ వాదనకు ఏపీ బుధవారం తన వాదనను అధికారికంగా వినిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ ఫిర్యాదుపై సమాచారం అందుకున్న వెంటనే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మంగళవారం పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ను ఆరా తీశారు.
అప్లికేషన్ కాపీ చేసిన బాబు ప్రభుత్వం: పోలీసులకు టి ఫిర్యాదు
ఈ విషయంలో తెలంగాణ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆరోఖ్యరాజ్ సీఎంకు వివరించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించాలని చంద్రబాబు ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ తన వాదనను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
'పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం నెలకొల్పి పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ముందంజలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ప్రపంచ బ్యాంకు, కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించిన తొలి సర్వేలోనే రెండో స్థానంలో నిలిచాం. గత సంవత్సరం కంటే మెరుగైన స్థానం కోసం గుజరాత్ తో పోటీ పడుతున్నాం. తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు' అని ఏపి వాదిస్తోంది.
అంతేగాక, పారిశ్రామిక, వాణిజ్యపరమైన వివాదాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఆయా వివాదాలకు సంబంధించి న్యాయస్థానం వేసిన ప్రశ్నలను యథాతథంగా వెబ్సైట్లో పొందుపరిచాం. ఇందులో మార్పు చేర్పులకు వీల్లేదు' అని తెలిపింది.
'నిజానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి ఈ ఏడాది జూన్ 30తో గడువు ముగిసినా... కేంద్రంపై ఒత్తిడి చేసి గడువును జులై 7 వరకు పొడిగించేలా చేశాం. అయినప్పటికీ సంబంధిత ఆధారాలను జూన్ 30 లోపే సమర్పించాం. తెలంగాణకు ఏమైనా సందేహాలుంటే... ప్రపంచ బ్యాంకు, కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలను సంప్రదించవచ్చు' అని ఏపీ తన వాదనను వినిపించనున్నట్లు తెలిసింది.
కాగా, తెలంగాణ పరిశ్రమల శాఖ వెబ్సైట్ను కాపీ చేశారంటూ సైబర్ క్రైమ్లో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాపీరైట్ యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్ లైన్ అప్లికేషన్ను ఏపీ ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. తాము తయారు చేసిన ఆన్ లైన్ అప్లికేషన్ పార్మాట్ను ఏపీ ప్రభుత్వం మక్కీకి మక్కీ తస్కరించిందని తమ ఫిర్యాదులో పేర్కొంది. ఫార్మాట్లో తెలంగాణ అని ఉన్నచోట ఏపీ అని పెట్టారని పేర్కొంది.