తిరుపతిలో ఫస్ట్ డెల్టా ప్లస్ వేరియంట్: ధృవీకరించిన డిప్యూటీ సీఎం
తిరుపతి: భారత్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో.. స్వరూపాన్ని మార్చుకున్న మహమ్మారి విరుచుకుపడటం ప్రారంభించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్లల్లో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త మ్యూటెంట్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసు.. ఏపీలో నమోదైంది. టెంపుల్ టౌన్ తిరుపతిలో తొలి కేసు రికార్డయింది. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ధృవీకరించారు కూడా. డెల్టా ప్లస్ వేరియంట్కు సంబంధించిన ఒక పాజిటివ్ కేసు తిరుపతిలో నమోదైందని ఆయన వెల్లడించారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ రెండోస్థానం: టీడీపీ కౌంటర్: రూ.65 వేల కోట్లు మా హయాంలోనే: పట్టాభి
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు ఆళ్ల నాని హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందు ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ పాజిటివ్ కేసు నమోదైందని చెప్పారు. ఆ పేషెంట్కు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని అన్నారు. ఆ పేషెంట్ కాంటాక్టుల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు. అతని ద్వారా మరొకరికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ కాలేదని ఆళ్ల నాని స్పష్టం చేశారు.
కరోనా వైరస్ థర్డ్వేవ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయంటూ నిపుణులు, కేంద్రప్రభుత్వం చేసిన హెచ్చిరకలను పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటోన్నామని వివరించారు. థర్డ్వేవ్ పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. థర్డ్వేవ్లో మరణాల సంఖ్యను నియంత్రించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తామని చెప్పారు. వైద్య, ఆరోగ్య రంగానికి, ఆసుపత్రులకు మౌలిక సదుపాయాలను కల్పించానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. లాక్ డౌన్ సడలింపులపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆళ్ల నాని చెప్పారు.