మందుబాబుకు శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం
ఏపీలో మద్యం విధానం గత ఐదు సంవత్సరాలుగా ఎంత అభాసుపాలైందో అందరికీ తెలిసిందేనని, తిరిగి దీన్ని పట్టాలెక్కించి ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో పేదలు తాగే టాప్ 5 బ్రాండ్లను గత ప్రభుత్వం తరిమేసిందని, బూంబూం, ఇతర పేర్లతో రకరకాల బ్రాండ్లు తీసుకువచ్చారన్నారు. మద్యం పాలసీ అత్యుత్తమంగా ఉండేలా రూపొందించబోతున్నామని, మద్యం ధరలను సమీక్షించి, అందుబాటు ధరల్లో పేదలకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
పారదర్శకంగా మద్యం కొనుగోలు
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలోని అబ్కారీ శాఖను పునర్వ్యవస్థీకరిస్తామని, వారిపై పర్యవేక్షణకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం బార్ల విధానాన్ని తీసుకువస్తామన్నారు. నాటు సారాతోపాటు పన్నులు చెల్లించని మద్యాన్ని అరికడతామని, షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ఉంటాయని, పునరావాస కేంద్రాలను పెంచడంతోపాటు డి అడిక్షన్ కేంద్రాలను కూడా పెంచుతామన్నారు. ప్రభుత్వం తరఫున మద్యాన్ని కొనుగోలు చేసేందుకు పారదర్శక విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

ఈడీకి మద్యం కేసు?
మద్యం షాపుల్లో విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును తర్వాతరోజు బ్యాంకుల్లో కచ్చితంగా డిపాజిట్ చేయాలని, కానీ అలా డిపాజిట్ చేసేందుకు నాలుగు రోజుల సమయం తీసుకున్నారన్నారు. ఇంత గ్యాప్ లో కొందరి జేబుల్లోకి సొమ్ములు వెళ్లాయని, ఇలా వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం అతి పెద్దదని, బ్రూవరీలు, డిస్టిలరీల్లో తయారైన మద్యాన్ని నేరుగా షాపులకు పంపించారన్నారు. వీటిద్వారా వచ్చిన డబ్బులను దారి మళ్లించడం జరిగిందని చంద్రబాబు వివరించారు. మద్యం కుంభకోణంపై సీఐడీతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తోంది. అవసరమైతే కేసును ఈడీకి రిఫర్ చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications