ఏపీలో రేషన్కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం
నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను కూడా సమాంతరంగా పరుగులు తీయిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు అంటే కేవలం అభివృద్ధి అనే పదం వినిపించేది. అయితే సంక్షేమ పథకాలకు ప్రజలు అలవాటుపడిన తర్వాత వాటిని కొనసాగించడమేకానీ తీసేస్తే రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని ఆయన గుర్తించారు. అందుకే తన ప్రభుత్వంలో కూడా సంక్షేమానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.
బియ్యంతోపాటు వివిధరకాల సరుకులు
వివిధ రకాల పథకాలను అమలు చేసుకుంటూ వస్తోన్న ఏపీ ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్తను వినిపించింది. గత ప్రభుత్వ హయాంలో బియ్యంతోపాటు మరో రెండు సరుకులను మాత్రమే అందజేసేవారు. ఎండీయూ వాహనాలద్వారా వీధి చివరకు వచ్చి ఆ వీధిలో ఉన్నవారికి అందించి వెళ్లేవి. ఈ పథకంలో అన్నీ లొసుగులే ఉన్నాయని, ఇంటింటికీ బియ్యం అందజేయడంకానీ, వాహనాలద్వారా కానీ ప్రజలకు లబ్ధి చేకూరలేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పౌరసరఫరాలశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని చెప్పారు.

ఎండీయూ వాహనాల రద్దు?
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బియ్యంతోపాటు అనేకరకాల సరుకులను షాపులద్వారా అందించేవారిమని, గత ప్రభుత్వం వాటిని రద్దుచేయడంతో పునరుద్ధరించాలంటూ అధికారులను ఆదేశించారు. బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, గోధుమపిండి, రాగులు, ఉప్పు, నూనె లాంటి నిత్యావసరాలను ప్రజలు పొందేవారు. వాటిని మళ్లీ అందించబోతున్నారు. ఎండీయూ వాహనాలను (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్) గత ప్రభుత్వ హయాంలో బియ్యం స్మగ్లింగ్ కు ఉపయోగించుకున్నారనే ఆరోపణలు రావడంతో ఈసారి సమీక్ష నిర్వహించే సమయానికి ఈ వాహనాలను ఏం చేయాలి? రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి?
అనే విషయాలపై ఒక స్పష్టతతో, కార్యాచరణ ప్రణాళికతో రావాలని ఆదేశించారు. ఎండీయూ వాహనాలవల్ల ప్రభుత్వానికి నష్టమేకానీ ఎటువంటి లాభం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తోపాటు శాఖ ఉన్నతాధికారులు కూడా సీఎంకు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూ.1844 కోట్లతో 9260 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని, వీటిలో అవినీతి జరిగిందని మంత్రి తెలిపారు. దాదాపుగా వీటిని రద్దుచేసే అవకాశం ఉందని, కాకపోతే ఈ వాహనాల కొనుగోలు బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications