నిరుద్యోగులకు శుభవార్త:ఎపిలో త్వరలో 20వేల ఉద్యోగాల భర్తీ
అమరావతి:రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాల సంఖ్య సుమారుగా 20వేల వరకు ఉండొచ్చని తెలిసింది.
ఇదే విషయంపై టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారట. ఆ సమావేశం అనంతరం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈ ఉద్యోగాల భర్తీ విషయాలను మీడియాకు తెలిపారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అంశం గురించి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా పార్టీ నేతలకు వెల్లడించినట్లు కళా వెంకట్రావు చెప్పారు.
తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఉక్కు దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టే విషయమై టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కళా వెంకట్రావు తెలిపారు. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం 1500 రోజుల పాలన పూర్తవుతున్న సందర్భంగా జులై 16న గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గ్రామ దర్శినిలో భాగంగా నాలుగు నెలల్లో 75 రోజులు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల విషయమై ఇటీవల వచ్చిన సర్వేల పట్ల వివిధ పార్టీలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు.
అయితే ఎవరేమన్నా నూటికి నూరు శాతం ప్రజలు టిడిపితోనే కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమంలా సాగుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఇలాగే కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తెదేపా మళ్లీ రాకుంటే రాష్ట్రం ఏమైపోతుందనే ఆందోళన ప్రజల్లో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని, ఈ లోపు బూత్ కమిటీలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని నిశ్చయించామని కళా వెంకట్రావు తెలిపారు.