ప్రభుత్వ ఉద్యోగులకు తియ్యటి శుభవార్త చెప్పిన చంద్రబాబు
జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంలో ఉద్యోగులది కీలక పాత్ర. అందుకు తగ్గట్లుగానే అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి శుభవార్తను వినిపించారు. సచివాలయంలో పనిచేస్తున్నవారితోపాటు హెచ్వోడీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్తించేలా 24 శాతం ఇంటి అద్దె భత్యాన్ని (హెచ్ఆర్ఏ) కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
అస్తవ్యస్తంగా భూముల రీసర్వే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో భూముల రీ సర్వే అస్తవ్యస్తంగా జరిగిన సంగతి తెలిసిందే. దీన్ని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూముల రీసర్వేపై రెవెన్యూశాఖతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసు చర్చకు రానుంది. దహనం తర్వాత జరుగుతున్న పరిణామాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల కోసం గాలిస్తున్న పోలీసులు.. తదితర విషయాలను చర్చించనున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా కూడా ఇందులో పాల్గొంటారు. గత ఐదు సంవత్సరాల్లో భూముల రిజిస్ట్రేషన్లలో చోటుచేసుకున్న అవకతవకలపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.

నివేదిక తయారుచేసిన సిసోడియా
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం సందర్భంగా విచారణ కోసం వెళ్లిన రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాకు పెద్ద సంఖ్యలో బాధితులు వినతిపత్రాలు అందజేశారు. తమ ఆస్తులను, భూములను పెద్దిరెడ్డితోపాటు ఆయన సోదరులు, అనుచరులు ఆక్రమించారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన ఓ నివేదిక తయారుచేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. రెవెన్యూశాఖ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 24 మండలాల పరిధిలో 482 మంది బాధితులు ఫిర్యాదు చేయగా వాటిల్లో ప్రయివేటు భూములతోపాటు ప్రభుత్వ భూముల ఆక్రమణలు కూడా ఉన్నాయి. వీటితోపాటు రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగిన భూదందాలు, అక్రమాలను కూడా బయటకు తీసి విచారణ జరిపించాలంటూ ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications