నిరుద్యోగులకు శుభవార్త:ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు కొనసాగింపు;జీవో జారీ
Recommended Video
అమరావతి:రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకునేందుకు వయసు మీరిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న గరిష్ఠ వయోపరిమితి పెంపును ఎపి గవర్నమెంట్ మరో ఏడాదిపాటు పొడిగించింది.
ఈ మేరకు ఏజ్ లిమిట్ ను పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో 132 ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవోతో యూనిఫాం సర్వీసులు (పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, అటవీ, రవాణా శాఖ) ఉద్యోగాలకు మినహా మిగతా ఉద్యోగాలకు జనరల్ విభాగానికి చెందిన అభ్యర్థులు 42 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ పోస్టులకు...వర్తిస్తుంది
అంటే డీఎస్సీ, ఎపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులకు వయోపరిమితి పెంపు వర్తిస్తుంది. ఈ వయోపరిమితి పెంపు గడువు 30/9/2029 వరకు వర్తించనుంది. కాగా, వయోపరిమితిని పెంచుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గడువు సెప్టెంబర్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే.
నిరుద్యోగుల్లో...నూతనోత్సాహం
త్వరలో గ్రూప్స్,డిఎస్సీ,పోలీస్ పోస్టులతో సహా వివిధ శాఖలకు సంబంధించి వేలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ తాజా జీవో జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆనందోత్సాహాలు నింపనుంది.
త్వరలో...గ్రూప్స్ తుది సిలబస్
ఇదిలావుండగా రాష్ట్రస్థాయిలో అత్యున్నత ఉద్యోగాలను అందించే గ్రూప్-1, గ్రూప్- 2 సర్వీసులకు సంబంధించిన తుది సిలబస్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన గత సోమవారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సర్వీసులకు సంబంధించి ముసాయిదా సిలబస్ ను నిపుణుల కమిటీకి పంపించామని, పరిశీలన పూర్తికావచ్చిందని చెప్పారు.
నెలాఖరుకు...రిక్రూట్మెంట్ కేలెండర్..
ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేయాల్సిన పోస్టులకు రోస్టర్ పాయింట్లతో ఇండెంట్లు పంపించాల్సిందిగా యూనిట్ ఆఫీసులకు లేఖలు రాశామన్నారు. యూనిట్ ఆఫీసర్లు ఈ నెల 3-4 తేదీల్లో తమ కార్యాలయానికి వచ్చి పలు అంశాలపై వివరణలు తీసుకోవడం కూడా జరిగిందన్నారు. ఈ నెలాఖరు కల్లా రిక్రూట్మెంట్ కేలెండర్ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సారి దాదాపు 30కి పైగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని ఎపిపిఎస్సీ ఛైర్మన్ ఉదయ భాస్కర్ చెప్పారు.