అదానీ డీల్ పై కీలక నిర్ణయం దిశగా చంద్రబాబు? రాయిటర్స్ కు ఆర్థికమంత్రి హింట్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో సౌర విద్యుత్ సరఫరా కోసం కుదుర్చుకున్న ఒప్పందంలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు రూ.1750 కోట్ల ముడుపులు అందాయని టీడీపీ ఆరోపిస్తోంది. అటువంటప్పుడు గతంలో జగన్ సర్కార్ అదానీ ఎనర్జీతో కుదుర్చుకున్న ఈ డీల్ ను ఎందుకు రద్దు చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ అయితే మరో అడుగు ముందుకేసి ఆ డీల్ రద్దు చేసే దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నిస్తోంది. అటు పీసీసీ ఛీఫ్ షర్మిల అయితే ఈ డీల్ రద్దు చేయకపోతే మీపై డౌట్స్ వస్తాయని చెప్తూ నిన్న ఓ లేఖ కూడా రాశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం అదానీ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్ పొందేందుకు పాతికేళ్లకు సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అదానీ నుంచి జగన్ ముడుపులు అందుకున్నారంటూ పరోక్షంగా అసెంబ్లీలో ప్రస్తావించిన చంద్రబాబు.. ఈ విషయంలో ఏం చేయాలో పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఆర్ధికమంత్రి పయ్యావుల వెల్లడించారు.

అదానీ గ్రూప్తో అనుసంధానమైన విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశాలను అన్వేషించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైళ్లను సమీక్షిస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. గతంలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ ఒప్పందానికి సంబంధించిన అంతర్గత ఫైళ్లన్నింటినీ ప్రభుత్వం తవ్వి తీస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాయిటర్స్తో అన్నారు. కాంట్రాక్ట్ను రద్దు చేసే అవకాశం ఉన్నట్లేనని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఏం చేయాలో కూడా తాము పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వం ఈ సమస్యను నిశితంగా పరిశీలిస్తోందని రాయిటర్స్ కు వెల్లడించారు.












Click it and Unblock the Notifications