ఏపీలో మరో కొత్త పథకం.. కావల్సిన అర్హత పత్రాలు
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు సారధ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా పెంచిన పింఛన్లతోపాటు అన్న క్యాంటిన్లు ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. స్త్రీలకు నెలకు రూ.1500 అందించే పథకంపై కసరత్తు జరుగుతోంది. మహాశక్తి పథకంలో భాగంగా సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు. దీన్ని త్వరలోనే అమలు చేయబోతున్నారు. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఏ పత్రాలు కావాలి అనే విషయాలను తెలుసుకుందాం.
దారిద్ర్యరేఖకు దిగువన ఉండాలి
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దీపం యోజన పథకం కింద నెలకు మూడు ఉచిత సిలిండర్లు అందజేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పొందాలనుకునేవారు రాష్ట్రవాసులై ఉండాలి. ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఈ పథకానికి అనర్హులు. ఆధార్ కార్డుతో లింకైన ఫోన్ నెంబరు, విద్యుత్తు బిల్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఫొటో ప్రూఫ్, చిరునామా ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. త్వరలోనే దీనికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఏ తేదీ నుంచి అనే విషయమై ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయబోతోంది.

ఇంటింటికీ స్క్రీనింగ్ పరీక్షలు
వచ్చేనెల 15వ తేదీ నుంచి మరో పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్ర బడ్జెట్ లో దీనికోసం ప్రత్యేకంగా దాదాపు 800 కోట్లరూపాయలకు పైగా కేటాయించారు. 15వ తేదీ నుంచి ఇంటింటికీ తిరిగి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. దీనిద్వారా క్యాన్సర్ మొదటిదశలోనే గుర్తించి వెంటనే చికిత్స అందించవచ్చు. క్యాన్సర్ స్టేజ్ పెరుగుతుంటే వీరిని గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేంద్రాలకు పంపిస్తారు.












Click it and Unblock the Notifications