మహిళలకు మరో పథకాన్ని తెచ్చిన చంద్రబాబు.. కిట్తోపాటు రూ.5వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా చంద్రబాబునాయుడు అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. గతంలో ఆయన అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవారు. అయితే రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులవల్ల సంక్షేమం తప్పనిసరి అని ఆయన భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మహిళల కోసం మరో పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఎన్టీఆర్ బేబీకిట్ల పథకాన్ని తిరిగి పునరుద్ధరించబోతున్నారు.
జిప్ బ్యాగ్ లో అందిస్తారు
కొన్నాళ్ల కిందట వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో కూడా బేబీకిట్ల అమలు పథకం చర్చకు వచ్చింది. తాజాగా దీన్ని త్వరలోనే అమలు చేయబోతున్నారు. బాలింతలకు ఇచ్చే బేబీ కిట్లలో చిన్న పిల్లలకు ఉపయోగించే సబ్బు, దోమతెర, దుప్పటి, డైపర్స్, న్యాప్ కిన్, లోషన్, పౌడర్, స్లీపింగ్ బెడ్స్ ఉంటాయి. వీటిని జిప్ బ్యాగ్ లో పెట్టి వారికి అందజేసేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రద్దు చేసింది. దీంతో ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టే యోచనలో ముఖ్యమంత్రి అధికారులకు సాధ్యాసాధ్యాలపై ఆదేశాలను జారీచేశారు.

ఒక్కొక్కరికి రూ.1300 ఖర్చు
వారంతా పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, జార్కండ్ రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్న తీరును పరిశీలించి నివేదిక తయారుచేశారు. ఈ పథకం కింద ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి ఖర్చు రూ.1300 అవుతోంది. మహిళలు ప్రసవమైన తర్వాత బిడ్డలకు ఎటువంటి ఇన్ ఫెక్షన్లు సోకూడదనే ఉద్దేశంతో ఈ కిట్లను అందజేయనున్నారు.
ఈ పథకంతోపాటు రాష్ట్రంలో ఆసరా కింద బాలింతలకు రూ.5వేలు ఇచ్చే పథకాన్ని ఇప్పటికే కొనసాగిస్తోంది. అలాగే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు నాణ్యమైన బెడ్ షీట్లు అందివ్వబోతున్నారు. నియోజకవర్గాల స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఫీడర్ అంబులెన్స్ కు, సాధారణ అంబులెన్స్ కు మధ్య అనుసంధానతను కూడా పెంచబోతున్నారు.












Click it and Unblock the Notifications