మందుబాబులకు పండగే! ఇక మన ఎయిర్పోర్టుల్లో కూడా బార్లు, వైన్షాపులు.
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా, దేశంలోని ఇతర ప్రధాన నగరాల తరహాలో ఏపీలోని విమానాశ్రయాల్లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తిరుపతి విమానాశ్రయం మినహా, రాష్ట్రంలోని మిగిలిన ఎయిర్పోర్టుల్లో 24 గంటల పాటు బార్లు, వైన్షాపులను ఏర్పాటు చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ లైసెన్సులను జారీ చేయనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్కుమార్ మీనా శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ వారంలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది.
విమానాశ్రయాల్లో వ్యాపార నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. ఈ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారు నాన్-రిఫండబుల్ దరఖాస్తు రుసుముగా బార్లకు రూ. 5 లక్షలు, వైన్షాపులకు రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వార్షిక ప్రయాణికుల రద్దీని బట్టి బార్ల లైసెన్సు ఫీజు (రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్)ను నిర్ణయించారు. రద్దీ 20 లక్షల కంటే ఎక్కువగా ఉన్న చోట రూ. 25 లక్షలు, అంతకంటే తక్కువగా ఉన్న విమానాశ్రయాల్లో రూ. 15 లక్షల వార్షిక ఫీజుగా ఖరారు చేశారు. అన్ని విమానాశ్రయాల్లోని వైన్షాపుల లైసెన్సు ఫీజును మాత్రం రూ. కోటిగా నిర్ణయించారు.

నిబంధనలతో కూడిన విక్రయాలు
ఒక విమానాశ్రయ బార్ లైసెన్స్ కింద గరిష్ఠంగా మూడు సర్వీసింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. 24 గంటలూ బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ, విమానాశ్రయాల కార్యాచరణ అవసరాలకు లోబడి మాత్రమే ఇవి పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా భద్రతా పరమైన ఆదేశాలు, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అధ్యయనాల తర్వాతే తుది నిర్ణయం
విమానాశ్రయాల్లో బార్ల నిర్వహణపై మంత్రుల బృందం చాలా కాలంగా అధ్యయనం చేస్తోంది. దిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే, ఏపీలో కూడా అదే తరహా నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. మంత్రుల బృందం చేసిన సూచనల మేరకు లైసెన్సు రుసుములు, సమయపాలన, కౌంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం తాజా ఉత్తర్వులను వెలువరించింది.














Click it and Unblock the Notifications