హైదరాబాద్లో కేశినేని చిన్ని భూకబ్జాలపై సీఎం రేవంత్ కు కేశినేని నాని షాకింగ్ లేఖ!
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కేశినేని నాని చేసిన సంచలన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర భూకబ్జా ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోని ప్రగతి నగర్, షంషిగూడ ప్రాంతంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేశినేని చిన్నిపై కేశినేని నాని లేఖ
ఆ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కేశినేని చిన్ని మరియు ఆయన సంబంధిత బినామీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయని కేశినేని నాని ఆరోపించారు.ఈ అక్రమ యత్నాలను అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నాని తన లేఖ మరియు సోషల్ మీడియా పోస్టుల్లో ఈ భూమివివాదంపై వివరాలు బయటపెట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు ఆదేశాలు మరియు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆంక్షలను దాచిపెట్టారన్నారు.

అక్కడ హైడ్రాను రంగంలోకి దించి ఆక్రమణలను తొలగించాలన్న కేశినేని నాని
సుప్రీంకోర్టులో నకిలీ రాజీ ఒప్పందాలు చేసుకుని భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూమిపై ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు ఎలాంటి హక్కులు లేవని జిల్లా కలెక్టర్ గతంలో సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. ఈ అక్రమ ఆక్రమణలను తక్షణమే అరికట్టాలని మాజీఎంపీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల సంరక్షణకు ఏర్పాటు చేసిన 'హైడ్రా'ను ఈ ప్రాంతంలో రంగంలోకి దించి ఆక్రమణలను తొలగించాలని కోరారు.
కబ్జా యత్నం చేసేవారిపై కేసులు పెట్టాలని డిమాండ్
అలాగే ఈ భూకబ్జా యత్నంలో పాల్గొన్న వ్యక్తులపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూమి ఐటీ పార్క్ అభివృద్ధికి కేటాయించబడింది. ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం పాలకుల బాధ్యత అని నాని లేఖలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకుని అడ్వకేట్ జనరల్ ద్వారా కోర్టు మార్గంలో అక్రమ బదలాయింపులను అడ్డుకోవాలని ఆయన కోరారు.
ప్రభుత్వం నుంచి తక్షణ చర్యలు జరగాలని డిమాండ్
ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేశినేని నాని తన ట్విట్టర్ ఖాతాలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం నుంచి తక్షణ చర్యలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు తీవ్రతను బట్టి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications