రాజధానులపై హైపవర్ కమిటీ ఏర్పాటు: ఆ నివేదిక ఆధారంగా తరలింపు నిర్ణయం: మూడు వారాల సమయం..!
తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మూడు రాజధానుల అంశం పైన అధ్యయనం కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్దిక మంత్రి బుగ్గన నాయకత్వంలో ఈ కమటీ ఏర్పాటు అయింది. మంత్రులతో పాటుగా డీజీపీ సవాంగ్ తో సహా పలువురు అధికారులను సభ్యులుగా నియమించారు. గతంలో ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటుగా బీసీజీ నివేదికనుల ఈ కమటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక కోరాలని భావించింది.
అయితే, జీవోలో మాత్రం కేవలం బోస్టన్ నివేదిక పైనే ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొంది. నివేదిక పైన అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ నివేదిక వచ్చిన తరువాత అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి..అక్కడ నుండి ప్రజలను రాజధాని మార్పు అంశం వివరించి..అధికారికంగా నిర్ణయం ప్రకటించాలని భావిస్తోంది. దీంతో..ఈ కమటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చేందుకు మూడు వారాల సమయం నిర్ధేశించింది.
రాజధానులపై హైపవర్ కమిటీ...
శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు ఉంటే అవకాశం ఉందంటూ ..జీఎన్ రావు కమిటీ సిఫార్సులు ఆ దిశగా ఉండే అవకాశం ఉందంటూ సూచన ప్రాయంగా చెప్పారు. జీఎన్ రావు కమిటి తో పాటుగా బీసీజీ కమిటి నివేదిక ను అధ్యయనం చేసి..చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సభలో చెప్పారు. ఆ తరువాత జీఎన్ రావు కమిటి నివేదికలో ఇదే విధంగా సిఫార్సులు వచ్చాయి.
విశాఖలో ఏపీ పరిపాలన రాజధాని..కర్నూలు లో హైకోర్టు ద్వారా న్యాయ రాజధాని.. అమరావతిలో శాసనసభ కొనసాగింపు ద్వారా శాసనరాజధాని ఏర్పాటుకు సిఫార్సు చేసారు. దీంతో..అమరావతి ప్రాంతంలో దీనిని నిరిసిస్తూ అక్కడి రైతులు..స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో..ఈ నెల 27న జరిగిన కేబినెట్ సమావేశంలోనే జీఎన్ రావు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడుతుందని అంచనా వేసినా..ప్రభుత్వం ఈ విషయంలో తొందర పడకూడదని నిర్ణయించింది. అయితే, ఇప్పుడు బోస్టన్ కమిటీ నివేదిక పైన అధ్యయనంతో పాటుగా రాష్ట్రంలో డెవలప్ మెంట్ దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాల పైన కమిటీ సూచనలు కోరింది. ఆ మేరకు ఇప్పుడు మంత్రులు..అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
బుగ్గన నాయకత్వంలో మంత్రులు..అధికారులు
ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో ఆర్దిర మంత్రి బుగ్గనతో పాటుగా డీజీపీ గౌతం సవాంగ్.. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.. మంత్రులు బొత్సా సత్యనారాయణ.. మేకపాటి గౌతం రెడ్డి..విద్యాశాఖ మంత్రి సురేష్.. హోం మంత్రి సుచరిత..వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు..మార్కెటింగ్ శాఖా మంత్రి మెపిదేవి..పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని..రవాణా శాఖా మంత్రి పేర్ని నాని..ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి .. సీసీఎల్ఏ కమిషనర్..మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి..న్యాయ శాఖా కార్యదర్శితో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్య కన్వీనర్ గా వ్యవహరిస్తారు.
రాష్ట్రంలో డెవలప్ మెంట్ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి సైతం ఈ కమిటీ నివేదించనుంది. అవసరమైన సమయంలో అడ్వకేట్ జనరల్ అభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం కమిటీకి సూచించింది.
మూడు వారాల్లో నివేదిక..ఆ తరువాతనే
ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ జీఎన్ రావు నివేదికను ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటుందనేది చర్చకు కారణమైంది. ఆ కమిటీ మీద విమర్శలు ఉండటంతో..ప్రధానంగా బీసీజీ నివేదిక మీద అధ్యయనం చేయటంతో పాటుగా క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఈ కమిటీ నివేదిక సిద్దం చేయనుంది. జనవరి 3వ తేదీన బీసీజీ కమిటీ తుది నివేదిక ఇఛ్చే అవకాశం ఉంది.
దీని పైన అధ్యయనం చేసిన తరువాత హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక పైన తొలుత మంత్రి వర్గం చర్చించనుంది. అవసరమైతే అఖిలపక్షంలో చర్చ లేకుంటే నేరుగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టి..దీని పైన చర్చింది..రాజధాని మార్పు పైన ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో శాసనసభా వేదికగా రాజధాని మార్పు పైన ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.