ప్రజల అభీష్టం మేరకే..: ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు
అమరావతి: రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన 81, 85 జీవోలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్యను కోరుతున్నారని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకే ఇంగ్లీష్ మీడియపై జీవోలు తీసుకొచ్చామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఏపీ సర్కారు కోరింది.
కాగా, రాష్ట్రంలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ సర్కారు గతంలో రెండు జీవోలు 81, 85లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తెలుగు మీడియం లేకుండా కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండేలా జీవో జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో కొంతమంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదప్రతివాదనలు విన్న అనంతరం ఏపీ హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
మాతృ భాషలోనే ప్రాథమిక విద్య సాగాలని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అయితే, తాజాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.