ఐసీయూ ఆన్ వీల్స్: 108 అంబులెన్సుల్లో వెంటిలేటర్ కూడా: టెలీ మెడిసిన్ కోసం బైక్స్
అమరావతి: రాష్ట్రంలో ఎక్కడ? ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా ఛప్పున గుర్తుకొచ్చేవి 108, 104 అంబులెన్సులు. బాధితులను సత్వరమే ఆసుపత్రులకు తరలించి, సకాలంలో వైద్య చికిత్సను అందజేయడంలో ఈ అంబులెన్సులు అత్యుత్తమ సేవలను అందిస్తూ వస్తున్నాయి. ఫోన్ చేసిన 15 నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలానికి చేరుకునేలా అంబులెన్స్ల వ్యవస్థను 108 రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం. ఈ వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రశంసించిన సందర్భాలు లేకపోలేదు.
Recommended Video
అమిత్ షా..పక్కా లోకల్: ఆర్మీ క్యాంటీన్లలో అన్నీ స్వదేశీ వస్తువులే: విదేశీ వస్తువుల బహిష్కరణ?
ఈ అంబులెన్స్లను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దబోతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఐసీయు ఆన్ వీల్స్ తరహాలో వాటిని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసిన 1060 అంబులెన్స్ వాహనాలను వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించడానికి సన్నాహాలను ప్రారంభించింది. అందులో- ఎంపిక చేసిన కొన్ని అంబులెన్స్లల్లో వెంటిలేటర్లను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చే అవకాశాలు లేకపోలేదని సమాచారం. కొన్ని అంబులెన్సులను ఐసీయు ఆన్ వీల్స్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో పేషెంట్లను తరలించడంలో 108 అంబులెన్స్ల సేవలను దృష్టిలో ఉంచుకుని, వాటి సంఖ్యను పెంచింది. ఇదివరకే అందుబాటులో ఉన్న మరి కొన్ని అంబులెన్స్ వాహనాలను అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్గా తీర్చిదిద్దింది. వాటన్నింటినీ వచ్చే నెల 1వ తేదీన ప్రారంభించబోతోంది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య తదితరులు హాజరయ్యారు. టెలి మెడిసిన్ కోసం కొత్తగా బైక్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో టెలి మెడిసిన్ సేవలకు డిమాండ్ ఉంటోంది.
టెలి మెడిసిన్కు ఫోన్ చేయడం ద్వారా వైద్య సేవలను పొందేలా ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. ఫోన్ చేసిన వారికి మందులను కూడా ఇంటి వద్దకే సరఫరా చేస్తోంది. టెలి మెడిసిన్ సేవలను అందించే సిబ్బంది ప్రస్తుతం తమ సొంత వాహనాలను వాడుతున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి కొత్తగా బైక్లను కొనుగోలు చేయాలని, ఫలితంగా టెలి మెడిసిన్ సేవల్లో వేగం పెంచాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అంటున్నారు.