ఏపీలో భూములకు రెక్కలు: మార్కెట్ విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి: ఏపీలోని 13 జిల్లాల్లో భూముల మార్కెట్ విలువను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన భూముల మార్కెట్ విలువ రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఏపీ ఏర్పడిన తర్వాత విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో తొలిసారి ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది.
ఈ సమావేశంలో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం మరో రూ. 200 కోట్లను కేటాయించింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన చేశారు. అనుకున్న సమయానికి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కావాలంటే, ఈ మొత్తం నిధులు అవసరమవుతాయని చీఫ్ ఇంజనీర్ ప్రతిపాదనలు పంపారని అన్నారు.
దీంతో ఈ ప్రతిపాదనను ఆమోదించి, నిధులను మంజూరు చేశామని అన్నారు. ఆగస్టు 15 నాటికి పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి, రాయలసీమకు నీటిని ఇవ్వాలనే లక్ష్యంతోనే నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. వీటితో పాటు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
సుమారు రెండు లక్షల ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ జరిపించిన సంగతి తెలిసిందే. ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికపై సమావేశంలో చర్చించారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కూడా చర్చించింది. ఉల్లిపాయలు ధరలు రూ. 20కి మించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అవసరమైతే మహారాష్ట్ర నుంచి నాణ్యమైన ఉల్లి దిగుమతి చేసుకుని విక్రయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృత్రిమ కొరత సృష్టించే ఉల్లి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.