రిషికేశ్వరి ఆత్మహత్య ఎఫెక్ట్: యాంటీ ర్యాగింగ్ పాలసీ ప్రకటించిన ఏపీ సర్కార్
హైదరాబాద్: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీటెక్ ఆర్కిటెక్చర్ విద్యార్ధిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనతో ఏపీ ప్రభుత్వం మేల్కొంది. రాష్ట్రంలో యాంగీ ర్యాగింగ్పై ఏపీ ప్రభుత్వం పాలసీ ప్రకటించింది. యూనివర్సిటీ క్యాంపస్లోకి ఇతరులకు అనుమతించకూడదని ఆదేశాలిచ్చింది.
నాగార్జున యూనివర్సిటీ, కాలేజీ ప్రాంగణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బయో మెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయాలని, హాజరు ఆధారంగా పీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ నెల 31లోపు ఈ నిబంధనలు అమలు చేయాలని యూనివర్సిటీలకు ఆదేశించింది.
ఇటీవలే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ ఆర్కిటెక్చర్ విద్యార్ధిని రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఇలా ఉంటే నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు శుక్రవారం రిమాండును పొడిగించింది.
ఈ నెల 28వ తేదీ వరకు వారి రిమాండ్ పొడిగించింది. గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో నిందితులుగా అనీషా, జయచరణ్, శ్రీనివాస్ ఉన్నారు. ఏ1గా అనీషా, ఏ2గా జయచరణ్, ఏ3గా శ్రీనివాస్లు ఉన్నారు.