ఏపీ సర్కారు రైతులను ఆదుకోవాలి: రాజకీయ నేతలు కోట్లు బయటకు తీయరా? పవన్ కళ్యాణ్
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత వారం పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో రైతులు పెద్ద ఎత్తున పంట నష్టపోయారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులను తక్షణమే ఆదుకోవాలి..
పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఖరీఫ్ సీజన్లో రైతులు పెట్టిన ప్రతి పైసా నీటిపాలైందని వాపోయారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాలికా బద్ధంగా వ్యవహరించడంలేదని ఆరోపించారు. పరిహారాన్ని అందించడంలోనూ వైసీపీ సర్కారు పట్టనట్లుగా వ్యవహరిస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

మానవత్వంతో స్పందించాలి..
ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే రాష్ట్రంలో 2.71 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రధానంగా వరి పంట నీటిమునిగి కుళ్లిపోతోందని, తక్షణమే ప్రభుత్వం పరిహారం అందిస్తే తదుపరి పంటకు రైతులు సిద్ధమవుతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. గత సంవత్సరం చెల్లించాల్సిన పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన నాయకులు పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Recommended Video

రాజకీయ నాయకులు ఇప్పుడైనా కోట్లు బయటకి తీయాలి
అదేవిధంగా తెలంగాణలో వర్ష బీభత్సంపైనా పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఎన్నికలప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టే నాయకులు, ఇప్పుడు వరద బాధితులను ఆదుకునేందుకు డబ్బులు ఎందుకు బయటకు తీయరు' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కాగా, వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications