మళ్లీ భానుడి విశ్వరూపం.. ఆ 4 జిల్లాల ప్రజలు అస్సలు బయటకు రావొద్దు!
రాష్ట్రంలో చాలా రోజుల గ్యాప్ తర్వాత భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జూన్ మూడో వారం నాటికే నైరుతి రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నప్పటికీ, ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రత సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ మూడోవారంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో ఎండలు 40 డిగ్రీలు దాటిపోయాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత కాస్తా 45 డిగ్రీలను తలపిస్తూ పగటిపూట ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి బేజారవుతున్నారు.
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దీనితో పాటు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉత్తర తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి.

రాగల మూడు రోజుల వాతావరణ సూచనలు ఇవే:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:
ఈరోజు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అయితే వర్షాలు పడినా కూడా వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు అలాగే కొనసాగుతాయి. ఎల్లుండి కూడా కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన జల్లులు పడవచ్చు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
ఈరోజు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. రేపు (గురువారం) కొన్ని చోట్ల మోస్తరు జల్లులు పడవచ్చు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, ఉరుములు మెరుపుల ప్రభావం ఉంటుంది. తీవ్రమైన ఎండల కారణంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం పరివాహక ప్రాంతాలలో వేడి, తేమతో కూడిన ఉక్కపోత వాతావరణం జనాలను ఇబ్బంది పెట్టనుంది.
రాయలసీమ:
ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలతో కూడిన రాయలసీమ ప్రాంతంలో ఈరోజు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నప్పటికీ, పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కూడా తీవ్రమైన అసౌకర్యం, ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు హెచ్చరించారు.














Click it and Unblock the Notifications