చేసిన తప్పుకు వృద్ధాశ్రమాల్లో సేవలు చేయండి -ఖర్చులు భరించండి : టీడీపీ నేతకు హైకోర్టు వినూత్న తీర్పు...!!
కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదనే కారణంగా హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. దీనికి శిక్షగా అనాధ-వృద్ధాశ్రమాలకు వెళ్లి సేవలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ హయాంలో గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్..కార్యదర్శులుగా మన్నవ సుబ్బారావు..శ్రీనివాస రావులకు హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించనందుకు కోర్టు ధిక్కరణ కింద ఈ ఆదేశాలు జారీ చేసింది.
గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి అమ్మకాలు చేసే కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ రెన్యువల్కు హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. ఆ ఉత్తర్వుల అమలులో ఆలస్యం చేశారంటూ 2018లో సుమారు 25మంది కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా సుబ్బారావు, శ్రీనివాసరావు కోర్టు ముందు హాజరయ్యారు. ఏపీ వ్యవసాయ మార్కెట్ కమిటీల తరఫున న్యాయవాది ప్రకాశం వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ఇద్దరు ఉద్దేశపూర్వక జాప్యం చేశారని, ఇది ధిక్కారం కిందకే వస్తుందని న్యాయస్థానం తేల్చింది.
దీంతో.. కోర్టు ఆదేశాలు పాటించనందుకు వారిద్దరూ అనాథాశ్రమం, వృద్ధాశ్రమాలకు వెళ్లి ఎనిమిది ఆదివారాల పాటు అక్కడ ఉన్నవారికి అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేయాలని, అందుకయ్యే ఖర్చులు వారే భరించాలని స్పష్టం చేసింది. ఆశ్రమాల్లో ఉన్నవారితో సమయాన్ని గడపాలని ఆదేశించింది. గుంటూరు జిల్లా మంగళగిరి, నవులూరు రైల్వేగేటు సమీపంలోని షారోన్ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో ఎం.సుబ్బారావు, కృష్ణాజిల్లా కానూరు వద్ద ఉన్న సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ వృద్ధాశ్రమంలో ఎన్.శ్రీనివాసరావు భోజన ఏర్పాట్లుచేయాలని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు ఇచ్చారు. సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్న విషయాన్ని వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఇన్చార్జ్లు ధ్రువీకరించాలని పేర్కొంది. దానిపై సెప్టెంబర్ 19 కల్లా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేయాలని.. దీన్ని పాటించకపోతే ఆ విషయాన్ని రిజిస్ట్రార్(జ్యుడీషియల్) కోర్టు దృష్టికి తీసుకురావాలని తేల్చి చెప్పింది.