బాగోలేదు: బాబు, జగన్ ప్రధాని కాళ్లవద్దకు: దేవినేని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులతో రావాలని ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పిలుపునిచ్చారు. చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. సింగపూర్లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు.
ఏపీ పెట్టుబడులకు అనుకూలమని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికే రాష్ట్ర పరిస్థితి బాగోలేదన్నారు. ప్రస్తుతం ఏపీ 2025 విజన్ను నిర్దేశించుకున్నామన్నారు. 2022 నాటికి దేశంలోని మూడు ముఖ్య రాష్ర్టాల్లో ఏపీ ఉండాలన్నారు.
2029 నాటికి దేశంలోనే ఏపీ ప్రధాన రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 2025 నాటికి ప్రపంచ స్థాయిలో ఏపీకి మంచి గుర్తింపు వచ్చేలా చేయడమే లక్ష్యమన్నారు. దక్షిణాది రాష్ర్టాలకు ప్రధాన కేంద్రంగా ఏపీ ఉండాలనేది తమ కోరిక అన్నారు.
అంతకుముందు, సింగపూర్ ప్రతినిధులు చంద్రబాబుకు రాజధాని ప్లాన్ ఇచ్చారు. దానికి చంద్రబాబు కొద్ది మార్పులు చేశారు. మరో ఏడెనిమిది వారాల్లో ఇవ్వాలని చెప్పారు.
జగన్ పైన మండిపడ్డా దేవినేని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సోమవారం మండిపడ్డారు. ప్రాజెక్టులపై జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్ళలో పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు.
ఈడీ భయంతోనే జగన్ ప్రధాని కాళ్ల వద్దకు వెళ్లారని విమర్సించారు. జగన్ ఏమీ తెలియకుండా రాష్ట్రాల నీటి వాటాపై మాట్లాడుతున్నారన్నారు. ఈడీ జఫ్తుతో జగన్కు జైలు భయం పట్టుకుందన్నారు. జగన్కు కమీషన్ల కక్కుర్తి అన్నారు. పట్టిసీమ గురించి ఆయనకేం తెలుసన్నారు. గతంలో పోలవరం గురించి ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.