కరోనా వ్యాక్సినేషన్లో ఏపీ సరికొత్త రికార్డు: ఒకే రోజు 13 లక్షల మందికిపైగా వ్యాక్సిన్, కొత్త కేసులు డౌన్
అమరావతి: కరోనా వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాసింది. ఆదివారం ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయడం విశేషం.
ఏపీలో ఒకేరోజు 13.45 లక్షల మందికి వ్యాక్సిన్..
వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఆదివారం ఒక్కరోజే 13.45 లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు ఏపీ వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఒకేరోజు ఆరు లక్షల మందికి టీకా ఇచ్చిన గత రికార్డును ఇప్పుడు అధిగమించినట్లు చెప్పారు. వ్యాక్సిన్ సామర్థ్యానికి అనుగుణంగా వ్యాక్సిన్ డోసులను కేంద్రం అందించగలిగితే ఏపీకి ఎక్కువ సంఖ్యలో డోసులు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96 లక్షల మందికి డోసు వేసినట్లు అనిల్ సింఘాల్ తెలిపారు.
కరోనా కట్టడికి ముందు జాగ్రత్త చర్యలు
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రమాదం చూపుతుందనేది నిజం కాకపోవచ్చని అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 60 వేల ఆంఫోరిటెరిసిన్-బీ ఇంజెక్షన్లను ఆర్డర్ చేసినట్లు సింఘాల్ తెలిపారు. ఆస్పత్రుల్లో పీయూసీ ప్లాంట్ ఏర్పాటును పూర్తి చేస్తామని, 10వేల డి-టైప్ సిలిండర్లు కొనుగోలు చేయనున్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
ఏపీలో భారీగా తగ్గిన కొత్త కేసులు
ఇది ఇలావుండగా, ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలను పరీక్షించగా కొత్తగా 5446 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,50,563కు చేరింది. మరో 50 మంది కరోనాతో మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 12,319కి చేరింది. కరోనా బారి నుంచి తాజాగా, 7772 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 17,75,176కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 63,068 యాక్టివ్ కేసులున్నాయని ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,11,50,847 నమూనాలను పరీక్షించారు.