నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. అసెంబ్లీకి జగన్ వస్తారా..?
ఏపీ రాజధాని అమరావతిలో నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అలాగే 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి ఉభయ సభలు ప్రశ్నోత్తరాల తో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి అనే అంశం పై నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యే లు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైసీపీ ఘంటాపథంగా చెబుతోంది. అయితే గతంలో మాదిరిగానే కేవలం మండలి సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని కోరుతున్నానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఇదో అవకాశంగా చెప్పారు. అయ్యన్నపాత్రుడుగా నాకు గౌరవం ఇవ్వాలని అడగట్లేదని.. సభాపతి స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందన్నారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా తిరగటం మంచిది కాదని స్పీకర్ అన్నారు.

అసెంబ్లీకి జగన్..?
ఇక ఈ సమావేశాలకు మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి తప్పనిసరిగా సభలో జగన్ కనిపిస్తారని సోషల్ మీడియాలో, పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఇదే విషయంపై పూర్తి క్లారిటీ రాలేదు. ఇటీవల జగన్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు తనకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరని.. తగినంత సమయం ఇవ్వరని అన్నారు. మరి ఇవాళ్టి సమావేశాల్లో జగన్ వస్తారో లేదో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications