డేటా సెంటర్లు తాగే నీరు ఎంత ? తేల్చేసిన చంద్రబాబు..!
ఏపీలో విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు కూటమి సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ (Google Data Centre) రావడంతో, మూడు చోట్ల స్థలం కేటాయించి నిర్మాణాలకు కూడా ప్రభుత్వం సహకరిస్తోంది. అయితే డేటా సెంటర్ల రాకతో రాష్ట్రంలో నీటి వినియోగం పెరిగిపోతుందని, జనం నీళ్లు లేక ఇబ్బందులు పడతారని, భూగర్భజలాలు కూడా అడుగంటి పోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిపై సీఎం చంద్రబాబు స్పందించారు.
రాష్ట్రంలో డేటా సెంటర్లకు నీటి అవసరాలపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు (Chandrababu).. ఇవాళ నిర్వహించిన జల వనరులశాఖ సమీక్షలో ఆరోపించారు. మొత్తంగా వాటికి 3.5 టీఎంసీల నీరే సరిపోతుందని సీఎం తెలిపారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో తాగు నీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ తదుపరి పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఇప్పటికే విశాఖలో ఏర్పాటు చేసిన డేటా సెంటర్ నీటి వినియోగంపై స్దానికంగా ఆందోళన పెరుగుతున్న వేళ చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం లోటు వర్షపాతం పరిస్థితుల నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వల్ని, భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగు నీటి సరఫరా నిర్వహణ ప్రణాళిక, జలధార- జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకూ 89.9 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు.














Click it and Unblock the Notifications