గుడ్న్యూస్: కాకినాడలో కోలుకున్న కరోనా పేషెంట్..డిశ్చార్జి: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే దగ్గరుండి మరీ.. !
కాకినాడ: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. శుక్రవారం కూడా కొత్తగా 12 కేసులు నమోదు అయ్యాయి. గంటగంటకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులతో ఉక్కిరిబిక్కిరికి గురవుతోన్న రాష్ట్ర ప్రభుత్వానికి తూర్పు గోదావరి జిల్లా అధికార యంత్రాంగం ఓ శుభవార్త వినిపించింది. కరోనా వైరస్ బారిన పడిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న యువకుడు పూర్తిగా కోలుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయనను డాక్టర్లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో తొలి కరోనా పేషెంట్ ఆ యువకుడే.
కరోనా వైరస్ బాధితుల కుటుంబీకులతో మంత్రి హరీష్ రావు: 40 మంది ఇంటికెళ్లారంటూ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాకినాడ లోక్సభ సభ్యురాలు వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మి, ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ తదితరులు ఈ సందర్భంగా ఆ యువకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ యువకుడు డిశ్చార్జి అవుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న వారంతా జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడు, అతని కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఙతలు తెలిపారు.
రాజమహేంద్రవరానికి చెందిన ఆ యువకుడు కొద్దిరోజుల కిందటే విదేశాల నుంచి స్వస్థలానికి చేరుకున్నారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడ్డారు. వెంటనే ఆయనను రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుప్రతిలో వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు అనుమానించారు. రక్త పరీక్షలను సేకరించి కాకినాడలోని రంగారాయ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో నెలకొల్పిన కరోనా ల్యాబొరేటరీకి పంపించారు.
నివేదిక పాజిటివ్గా రావడంతో ఆయనను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చేర్చారు. సుమారు రెండువారాల చికిత్స అనంతరం ఆ యవకుడు పూర్తిగా కోలుకున్నారు. దీనితో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా కొద్దిపాటి జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని, కొద్ది రోజులు హోమ్ క్వారంటైన్ ఉండాలని సూచించినట్లు డాక్టర్లు చెప్పారు. కరోనా వైరస్ సోకడం వల్ల భయపడాల్సిన అవసరం లేదని, తాను ధైర్యంగా ఎదుర్కొన్నానని ఆ యువకుడు చెప్పారు. డాక్టర్లు తనకు నాణ్యమైన వైద్యాన్ని అందించారని అన్నారు. చికిత్స సమయంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని సూచించారు.