విజయవాడ టూ మక్కా...ప్రత్యేక విమానం:ప్రభుత్వ విప్ ఎంఏ షరీఫ్
అనంతపురం:రాష్ట్రంలో హజ్ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలు విజయవాడ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో పవిత్ర మక్కాకు వెళ్లేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
వచ్చేఏడాది నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నట్లు ఎపి ప్రభుత్వ విప్ ఎంఏ షరీఫ్ తెలిపారు.
అనంతపురంలోని డ్రైవర్స్కాలనీ ప్యారడైజ్ హాల్లో ఎంఏ షరీఫ్ ఆధ్వర్యలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున హజ్యాత్రకు వెళ్లే మక్కా యాత్రికులకు వ్యాక్సినేషన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ విప్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ హజ్యాత్రకు వెళ్లే ముస్లింలకు ఎలాంటి ఆరోగ్యకరమైన సమస్యలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తోందన్నారు. సౌదీ ప్రభుత్వ సూచన మేరకు ప్రతి హజ్ యాత్రికుడికి ఈ వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. యాత్రికులు నిబంధనల ప్రకారం జాగ్రత్తలు పాటించాలన్నారు.

ముస్లింల పాలిట ముఖ్యమంత్రి చంద్రబాబు అల్లా గా పనిచేస్తున్నారని ఎంఏ షరీఫ్ ప్రశంసించారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి, కోట్లాదిరూపాయల నిధులు కేటాయించారన్నారు. 1985లో హైదరాబాద్లో హజ్హౌస్ నిర్మించిన ఘనత ఎన్టీఆర్కు దక్కిందన్నారు. 250ఎకరాల్లో హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ తరహాలో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 150 ఎకరాల్లో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కడపలో రూ.12 కోట్లతో అత్యాధునిక హంగులతో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా మాట్లాడుతూ ముస్లింల జీవితానికి సార్థకత లభించేలా హజ్యాత్రకు పంపించేందుకు ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. జిల్లా నుంచి ఈ ఏడాది 408మంది మక్కాకు వె ళుతున్నారన్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి మాట్లాడుతూ ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి అమోఘమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయనకు సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications