అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న ఏపీభక్తులు; కుటుంబసభ్యుల్లో ఆందోళన.. సీఎంజగన్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు
అమర్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు వరద బీభత్సంలో చిక్కుకున్నారు. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ క్షేత్రానికి సమీపంలో వరద సృష్టించిన బీభత్సంతో ఇప్పటివరకు ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా 40 మంది గల్లంతైనట్లుగా సమాచారం. దీంతో అమర్నాథ్ యాత్ర గుహలలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సంఘటన స్థలంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగురాష్ట్రాల యాత్రికులు
అమర్నాథ్ యాత్రకు ప్రతీసారి తెలుగు రాష్ట్రాల ప్రజలు వెళ్ళటం ప్రధానంగా కనిపిస్తుంది. ఈసారి కూడా అమర్నాథ్ యాత్రకు వెళ్లిన పర్యాటకులలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చెందిన భక్తులు కూడా ఉండటంతో రెండు రాష్ట్రాలలోనూ అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాగైనా తమ వారిని రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారి క్షేమ సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారు.
విశాఖపట్నం నుండే 90 మందికి పైగా అమర్నాథ్ యాత్రకు.. స్పందించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి అమర్నాథ్ యాత్రకు చాలామంది వెళ్ళినట్లుగా సమాచారం. ఒక విశాఖపట్నం జిల్లా నుండే సుమారు 90 మంది వరకు అమర్నాథ్ యాత్రకు వెళ్ళినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన వారి జాబితా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన వీరిలో కొంతమంది వరద ముంపులో చిక్కుకున్నారు అన్న సమాచారంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
అధికారులకు అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన వారిని రక్షించాలన్న సీఎం ఆదేశాలు
తక్షణం వారిని కాపాడటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమర్నాథ్ యాత్ర లో చిక్కుకున్న భక్తుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సీఎంవో అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ పర్యాటకుల విషయంలో సంప్రదింపులు జరిపారు. ఏపీ ప్రజల కోసం రంగంలోకి దిగారు.
రంగంలోకి అధికారులు.. శ్రీనగర్ కు అడిషనల్ రెసిడెంట్ కమిషనర్
అమర్నాథ్ యాత్ర లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను రక్షించడానికి అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న హిమాన్షు కౌశిక్ శ్రీనగర్ కు వెళుతున్నారు. యాత్రికుల భద్రత కోసం తీసుకోవలసిన చర్యలపై అక్కడ స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, ఏపీ ప్రజలని కాపాడటం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటారని సీఎం అధికారులు చెబుతున్నారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.