ప్లాన్ ఆఫ్ యాక్షన్ : అమరావతిలో మూడంచెల భద్రత.. 5వేల పైచిలుకు పోలీసుల మోహరింపు
సోమవారం కేబినెట్,అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతిలో భద్రతను పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టం చేసింది. అసెంబ్లీ ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. అసెంబ్లీకి వందల మీటర్ల దూరం నుంచే బారికేడ్లు,ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సచివాలయం,అసెంబ్లీ ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో ప్రతీ ఒక్కరి కదలికలపై నిఘా పెడుతున్నారు. ఎమ్మెల్యేలు,మంత్రులు మినహా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మొత్తంగా 5వేల పైచిలుకు పోలీసులను రాజధాని ప్రాంతాల్లో మోహరించినట్టు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ తెలిపారు.
రాజధాని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ర్యాలీలు,ధర్నాలను అనుమతించేది లేదని చెప్పారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే సోషల్ మీడియా వదంతులపై కూడా దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వదంతులు సృష్టిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. శాంతియుత నిరసనలకు తాము అడ్డు చెప్పబోమని,కానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా,ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను నిలిపివేశారు. విజయవాడ బస్టాండ్,రైల్వే స్టేషన్,కనకదుర్గ వారధి,నగర పరిసరాల్లో భారీగా పోలీసుల మోహరించారు. జేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే,ఏపీ భవితవ్యంపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు అధికారికంగా ఆమోదముద్ర వేసి అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం ఉంది. అయితే రాజధాని పేరుతో కాకుండా అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు అటు రాజధాని జేఏసీతో పాటు,టీడీపీ నేతలు రేపటి సమావేశాలను అడ్డుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి కేంద్రంగా రేపు చోటు చేసుకోబోయే పరిణామాలు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.