పార్థీ గ్యాంగ్...పిల్లల్ని చంపే గ్యాంగ్ లపై ప్రచారం.. పుకార్లే.. నమ్మొద్దు:పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో...పార్థీ గ్యాంగ్ సభ్యులు సంచరిస్తున్నారని, పిల్లల్ని చంపేవారు తిరుగుతున్నారని వస్తున్న వదంతులపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు స్పందించారు. కిరాతక గ్యాంగ్ లు అంటూ కొందరు సోషల్ మీడియాలో రక రకాలుగా వదంతులు సృష్టిస్తూ అమాయక ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఈమేరకు వాట్స్అప్ లో అనేక నిరాధార మెసేజ్ లు పెడుతూ వున్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ అలాంటి వారు సంచరిస్తున్నట్లు ఎక్కడా ఆధారాలు లభ్యం కాలేదని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలా అనవసర వదంతులు వ్యాప్తి చేసే వారిపై ఐటి యాక్ట్ మేరకు కేసులు కూడా పెట్టి రిమాండ్ విధించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై అవగాహన కల్పించేందుకు జిల్లాల వారీగా పోలీసు అధికారులు పత్రికా ప్రకటనలు విడుదల చేస్తున్నారు.
ప్రజలు కూడా అవగాహన లేకుండా ఇలా తమకు వచ్చిన ప్రతి మెసేజ్ ను ఫార్వర్డ్ , లైక్ , కాపీ, పోస్ట్ చేయడం చేస్తే...తదనంతరం ఆ మెసేజ్ వలన ఎవరి ప్రాణాలకైనా హాని కలిగితే ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసిన వారి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఈ వాట్స్అప్ వదంతులు నమ్మవద్దని...తమ రక్షణ విషయమై నిశ్చింతగా ఉండవలసిందిగా పోలీసులు కోరుతున్నారు.
కొంత మంది తెలివిగా ఈ వదంతుల మెసేజ్ లను అందరికి ఫార్వర్డ్ చేసి, తరువాత డిలీట్ చేసి తమకు ఏమి తెలియనట్లు ఉండవచ్చు. కానీ వాట్స్అప్ సర్వర్ లో ఎవరు ఎవరికి ఎటువంటి మెసేజ్ లు ఏ రోజు, ఎన్ని గంటలకు పంపినారు అనే విషయాలు నిక్షిప్థమై వుంటుందని గమనించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కావున భాద్యత గలిగిన ప్రజలందరినీ మేము కోరుతున్నది ఏమిటంటే...అనవసర అపోమలతో అమాయకులపై దాడి చేయటం తగదని హెచ్చరించారు.
మీ దాడిలో బాధితులు ప్రాణాలు కోల్పోతే అప్పుడు దాడి చేసినవారే ప్రమాదంలో పడతారన్నారు. ఎవరైనా ఎక్కడైనా అనుమానాస్పదంగా సంచలరిస్తుంటే వెంటనే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరినైనా కించపరిచే, అవమానపరిచే , మరియు వ్యక్తి గతంగా ఆరోపణలుతో కూడిన లేదా చట్టవ్యతిరేకమైన పోస్ట్ లు చెయ్యడం చేస్తే అలాంటి వారిపై ఇండియన్ పినల్ కోడ్ 505, 1బి ఐపిసి మరియు 153, 34, 67, ఐటి యాక్ట్ ప్రకారం తప్పుడు పోస్ట్ లు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కావున ప్రజలు ఏదేని పోస్ట్ చేసేముందు కచ్చితమైన సమాచారం తెలుసుకొని పోస్ట్ చేయాలన్నారు.