స్తంభించిన రిజిస్ట్రేషన్: రూ. 20కోట్ల ప్రభుత్వ రాబడికి గండి, బైరటీస్ ద్వారా 594కోట్ల ఆదాయం
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు సమ్మెకు దిగడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు స్తంభించిపోయాయి. ఫలితంగా రూ.20 కోట్ల వరకూ ప్రభుత్వ రాబడికి గండిపడింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో కొన్ని సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే ప్రభుత్వ యోచనను వ్యతిరేకిస్తూ ఏపీ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది.
గురువారం నుంచి సమ్మె మొదలైంది. సమ్మె శుక్రవారం కూడా కొనసాగుతుందనీ, తమ బాధను ఈ విధంగా వెల్లడిస్తున్నామని దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణతెలిపారు.

బెరైటీస్ ద్వారా రూ. 594 కోట్ల ఆదాయం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో మంగంపేట బెరైటీస్ గనుల నుంచి ఇప్పటివరకు 22.80 లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికితీశామని, దీనిద్వారా 594 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని ఎపిఎండిసి మేనేజింగ్ డైరక్టర్ వెంకయ్య చౌదరి తెలిపారు. వచ్చే ఏడాది 30 లక్షల టన్నుల బెరైటీస్ వెలికితీసి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన అన్నారు.
మంగంపేట బెరైటీస్ గనులను ఆయన పరిశీలించారు. తొలుత గనుల్లో ఖనిజం వెలికితీత పనులను పరిశీలించి, కార్మికుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చేరిన నీటి వెలికితీతలో ఎదురవుతున్న ఇబ్బందులను కార్మికులు వివరించారు. అనంతరం ఎపిఎండిసి అతిథి గృహంలో ఆయన సంస్థ అధికారులు, ఉద్యోగులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వెంకయ్యచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. మంగంపేట బెరైటీస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని ఈ రంగానికి చెందిన అంతర్జాతీయ నిపుణుడు ఆల్బర్ట్ నివేదిక ఇచ్చారని చెప్పారు. భారత్ బెరైటీస్కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, అయితే గత ఏడాదిన్నర కాలంలో కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల అనుకున్న స్థాయిలో ఖనిజాన్ని వెలికితీయలేకపోయామని అన్నారు.
దుబాయ్, మలేషియా, చైనా, పాకిస్థాన్ నుంచి పోటీ ఉందని తెలిపారు. ప్రస్తుతం సౌదీ అరేబియా, కువైట్, అబుదాబీ వంటి గల్ఫ్దేశాలకు ఇక్కడినుంచి బెరైటీస్ ఎగుమతి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో పదిరోజుల్లో త్రివేణి ఎర్త్మూవర్స్ అనే సంస్థ కూడా బెరైటీస్ తవ్వకాల్లో పాలుపంచుకుంటుందని, దీనివల్ల ఖనిజం వెలికితీత పనులు వేగిరమవుతాయని, మరికొందరికి ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయన్నారు.












Click it and Unblock the Notifications