రూ.2.28 నుంచి రూ.2.38 లక్షల కోట్లు: ఎల్లుండే అసెంబ్లీ బడ్జెట్ భేటీ
అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం సమీపిస్తోంది. సభ ఎల్లుండి సమావేశం కాబోతోంది. ముందుగా నిర్దేశించుకున్న విధంగా ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశమౌతుంది. ఈ సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగించాలనే విషయం ఇంకా తెలియరాలేదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) దీన్ని నిర్ధారిస్తుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం సమక్షంలో దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిర్ణయాన్ని తీసుకుంటారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, కర్ఫ్యూ, కోవిడ్ ప్రొటోకాల్ వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులపాటు కొనసాగింపజేయాలనే విషయాన్ని ఖరారు చేస్తుంది. నాలుగైదు రోజులకు మించి సభ కొనసాగే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. 2021-2022 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదింపజేసుకోవడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని సమావేశపరుస్తున్నట్లు చెబుతున్నారు.

నిజానికి- ఈ ఏడాది మార్చిలోనే ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసింది. మూడు నెలల కాలానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్డినెన్స్ ద్వారా ఆమోదింపజేసుకుంది. ఇక పూర్తి కాలానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనల కోసం గురువారం నాడు శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనుంది.
తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి శాసన సభ, శాసన మండలి ధన్యవాదాలు తెలుపుతాయి. ఇటీవలి కాలంలో కన్నుమూసిన కడప జిల్లా బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య, చల్లా రామకృష్ణా రెడ్డికి సంతాపం ప్రకటిస్తాయి. అదేరోజు బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి అవసరమైన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల మొత్తం 2.28 లక్షల కోట్ల నుంచి 2.38 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications