మరొకరైతే గుండె ఆగి చనిపోయేవారు: నూతన అసెంబ్లీలో సీఎం(పిక్చర్స్)
భవిష్యత్తు తరాలు గర్వపడేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు.
హైదరాబాద్: భవిష్యత్తు తరాలు గర్వపడేలా అమరావతి నగరాన్ని నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. ప్రస్తుతం పంట పొలాల్లో సచివాలయం, శాసనసభ పొలాలు కనిపిస్తున్నాయని, భవిష్యత్తులో ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతిని రూపుదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆశీర్వదించి ముందుకు నడిపించాలని ప్రజలను కోరారు. వెలగపూడి సచివాలయ ఆవరణలో నిర్మించిన రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలి భవనాలను ఆయన గురువారం ప్రారంభించారు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
ఏదేమైనా సొంతగడ్డపై చట్టాలు చేసుకునే స్థాయికి రావడం చరిత్రేనని చంద్రబాబునాయుడు అన్నారు. ఉమ్మడి మద్రాస్ నుంచి విడివడినప్పుడు కర్నూలులో గుడారాల్లో పాలన సాగించారని గుర్తు చేశారు. 58 ఏళ్లు హైదరాబాద్ రాజధానిగా పరిపాలన సాగించామన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో వచ్చామని, ఇప్పుడు కట్టుబట్టలతోపాటు అప్పులతో కలిసి విడివడ్డామన్నారు. అయినా తక్కువ సమయంలో చేయగలమని నిరూపించుకున్నామన్నారు. తనకు ప్రజలే హైకమాండ్ అన్నారు.
తెలుగుజాతికి గుర్తుండిపోయాలా.. ఇంకొకరికైతే గుండె ఆగేది..
తెలుగుజాతి కోసం కృషి చేశానన్న ఆనందం చనిపోయాక కూడా శాశ్వతంగా ఉంటుందన్నారు. హైదరాబాద్లో ఐటి పరిశ్రమల ఏర్పాటు కోసం ఫైళ్లను తానే మోసుకువెళ్లానని, ట్రాఫిక్లో చిక్కుకుంటే నడిచి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని శాశ్వతంగా తెలుగు జాతికి గుర్తుండిపోతుందన్నారు. ఆ అన్యాయాన్ని అధిగమించేందుకు కసిగా పని చేశానని, తన కృషితో తిరుగులేని శక్తిగా తయారు చేస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ఆవేశాలను చూశామని, రాజీవ్ గాంధీ హత్య సమయంలో ఎన్టీఆర్ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. ప్రజలు నమ్మితే మనతో ఉంటారన్నారు. 2022 నాటికి దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా చేస్తానని, 2029 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో ఉంటామన్నారు. కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా, రాష్ట్భ్రావృద్ధి కోసం, భవిత కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నానని తెలిపారు. 16 వేల లోటు బడ్జెట్తో ప్రభుత్వ నడపాలంటే ఇంకోకరైతే గుండె ఆగి చనిపోయేవారన్నారు. అగ్రవర్ణల పేదలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు.
వాస్తు బాగుంది..
అమరావతి వాస్తు చాలా బాగుందని సిఎం తెలిపారు. ఈశాన్య దిశలో నీరు వెళ్లడం వాస్తుకు సరిగా సరిపోయిందన్నారు. వాస్తు అంతా చూసుకున్నాకే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశానని తెలిపారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం దుర్మార్గులపై, అభివృద్ధిని అడ్డుకునే వారి పట్ల కఠినంగా ఉంటానన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే బాగుండేదని ఆయన పరోక్షంగా వైకాపా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సీఎం భావోద్వేగం..
రాజధాని నగరానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం భావోద్వేగంతో పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో తక్కువ కాలంలో సచివాలయం, శాసనసభ, మండలి భవనాలను నిర్మాణం చేయడంతో సీఆర్డీఏ, అధికార యంత్రాంగాన్ని అభినందనలతో ముంచెత్తి సత్కారాలు చేశారు. అమరావతి వెలగపూడిలో కొత్తగా నిర్మాణం చేసిన తాత్కాలిక శాసనసభ, శాసన మండలి భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి ఛైర్మన్ చక్రపాణిలతో కలిసి సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, రాజధాని ప్రాంత రైతులు భారీగా హాజరయ్యారు. ఆడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రైతుల త్యాగాలను కొనియాడారు. అతితక్కువ కాలంలో నిర్మాణం చేసిన శాసనసభ భవనం అద్భుతంగా ఉందని పలువురు అభినందించారు.
అసెంబ్లీ నిర్మాణం ఒక చరిత్ర
210 రోజుల్లో సచివాలయంలోని అయిదు బ్లాకులు నిర్మిస్తే... కేవలం 192 రోజుల్లో శాసనసభ, మండలి భవనం పూర్తి చేశామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆరు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన శాసనం ఈపొలాల్లో జరుగనున్నాయని ఇది చరిత్రగా సీఎం అభివర్ణించారు. ఇవి తాత్కాలిక భవనాలు మాత్రమేనని, శాశ్వత భవనం అద్భుతంగా ఉంటుందని వివరించారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసుకోవడం సీఎం ఇచ్చిన స్ఫూర్తి అని కొనియాడారు. మండలి ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ తాత్కాలిక భవనం అయినా అన్ని సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని మయసభను గుర్తుకు తెస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం సంకల్పబలంతో ఒక్కో అడుగు ముందుకు పడుతుందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అజయ్కల్లాం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మదిలో ఆలోచనలకు ప్రతిరూపంగా అమరావతి ఆవిష్కృతమవుతోందని ఆర్థిక మంత్రి యనమలరామకృష్ణుడు కొనియాడారు. కేవలం 58 రోజుల్లో 34వేల ఎకరాలను రైతులనుంచి సమీకరించడానికి సీఎంపై వారికి ఉన్న విశ్వాసం, నమ్మకమేనని మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ 42 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేయగా దానిలో 18 ఎకరాలు పార్కింగ్, గ్రీనరీకి కేటాయించామని వివరించారు. 27 ఎకరాలు భవనాల నిర్మాణం కోసం వెచ్చించామని చెప్పారు. సీఎం ఇచ్చిన స్ఫూర్తితోనే రికార్డు స్థాయిలో తక్కువ కాలంలో భవనాల నిర్మాణం చేయగలిగామని చెప్పారు.
సంప్రదాయబద్దంగా..
శాసనసభ, శాసన మండలి సమావేశ మందిర భవనాన్ని సంప్రదాయబద్దంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. వేద మంత్రోత్సారణతో అసెంబ్లీ భవనం ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుడి పటంతో సీఎం భవనంలోకి ప్రవేశించి పూజలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. రాజధాని ప్రాంత రైతులు, కుటుంబసభ్యులు భారీగా తరలివచ్చారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అతితక్కువ సమయంలో భవనం నిర్మాణానికి కృషి చేసిన సీఆర్డీఏ కమీషనరు చెరుకూరి శ్రీధర్, ఎల్అండ్టీ అధికారులను, గుంటూరు జిల్లా కలెక్టరు కాంతిలాల్దండేలను దుశ్శాలువాతో సత్కరించారు. మార్చి 6 నుంచి ఈభవనంలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.