గట్టి దెబ్బేసిన ఎల్ నినో- షాక్ ఇస్తోన్న రుతుపవనాలు
భారత వాతావరణ శాఖ (IMD) నైరుతి రుతుపవనాలపై తాజా అంచనాలను వెల్లడించింది. ఇది రెండో దశ దీర్ఘకాలిక అంచనాలు. దీని ప్రకారం దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ నుండి అనేక రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని కూడా హెచ్చరించింది. ఇది.. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ఆందోళనలను మరింత పెంచినట్టయింది.
వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జూన్-సెప్టెంబర్ రుతుపవన కాలంలో లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA) వర్షపాతం 90 శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. ఇందులో నాలుగు శాతం వరకు హెచ్చు తగ్గులు నమోదు కావొచ్చని చెప్పారు. ఐఎండీ వెల్లడించిన ఈ తాజా వివరాలు రుతుపవనాల స్థితిగతులు ఎలా ఉండబోతోన్నాయనేది స్పష్టం చేశాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం.. అంటే ఎల్పీఏలో 94 నుండి 106 శాతం మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. మధ్య భారత్, దక్షిణాది రాష్ట్రాలు, దేశ వాయువ్య ప్రాంతం, రుతుపవనాల కోర్ జోన్ లల్లో ఈ సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని మహాపాత్ర తెలిపారు. జూన్ లో చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని, 92 శాతం కంటే దిగువకే ఉండొచ్చని ఆయన తెలిపారు.
జూన్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. మధ్య, వాయువ్య, తూర్పు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మినహా దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని మహాపాత్ర స్పష్టం చేశారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు.
ఏపీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్ లలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పులు వీస్తాయని అన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వివరించారు. సముద్ర పరిస్థితులపై మహాపాత్ర మాట్లాడుతూ, న్యూట్రల్ ఎల్ నినో సదరన్ అస్కిలనేషన్ (ENSO) స్థితి క్రమంగా ఎల్ నినో (El Nino) వైపు మారుతోందని తెలిపారు.
ఇది జూన్ నాటికి ఎల్ నినో సంభవించే అవకాశం 82 శాతానికి పెరుగుతుందని, జూలై, ఆగస్టు నాటికి 90 శాతానికి మించి ఉంటుందని మహాపాత్ర చెప్పారు. అలాగే రుతుపవనాల కాలమంతా న్యూట్రల్ ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
మే లో జాతీయ స్థాయిలో వర్షపాతం సాధారణం కంటే నాలుగు శాతం ఎక్కువగా నమోదైందని, నైరుతి రుతుపవనాలు సాధారణంగా వచ్చే తేదీ కంటే నాలుగు రోజుల ముందుగా అంటే 16న అండమాన్ దీవులలోకి ప్రవేశించాయని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుండి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్లోకి పురోగమించాయి. రాబోయే వారంలో కేరళ, ఈశాన్య రాష్ట్రాలకు రుతుపవనాలు చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మహాపాత్ర వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications