వెళ్లిపోమంటే సోనియా ఎంత బాధపడతారు?: జగన్
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత పౌరసత్వం తీసుకొని ముప్పయ్యేళ్లు అవుతోందని, ఇప్పుడు ఏదైనా బిల్లు తెచ్చి, ఆమె పౌరసత్వం చెల్లదని... దేశం విడిచి వెళ్లాలని అంటే మీరు ఎంత బాధపడతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రుల బృందాన్ని (జివోఎం)ను ప్రశ్నించారు.
హైదరాబాద్లో అరవై ఏళ్లుగా ఉన్నవారిని ఒక్కసారిగా వెళ్లి పొమ్మంటే అంతే బాధపడతారన్నారు. రాజకీయ లబ్ధి తప్ప మరే పద్ధతిని, ప్రాతిపదికని విభజనలో పాటించడం లేదని ఆరోపించారు. ఈ మేరకు జగన్ రాసిన లేఖను ఆ పార్టీ నాయకులు మైసూరా రెడ్డి, గట్టు రామచంద్ర రావు బుధవారం మంత్రుల బృందానికి సమర్పించారు.

బుధవారం ఉదయం 10.30 గంటలకు వారు జివోఎం సభ్యులతో భేటీ అయ్యారు. జగన్ రాసిన లేఖను సమర్పించి అందులోని వివరాలనే చదివి వినిపించారు. భేటీ ముగిసిన తర్వాత మైసూరా విలేకరులకు లేఖలోని వివరాలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జివోఎంకు చెప్పామని, విభజన ఏకపక్షంగా చేస్తున్నారని, దీనికి హేతుబద్ధత లేదని, ఒక ప్రాతిపదిక లేదని, కొందరు నాయకులు సోనియా పుట్టినరోజు బహుమతి అని చెప్పారని, ఇదేనా మీ ప్రాతిపదిక? అని అడిగినట్లు చెప్పారు.
ఏదైనా సరే, ఎస్సార్సీ వేసిన తర్వాత రెండు రాష్ట్రాల శాసనసభలు మూడింట రెండొంతుల ఆమోదంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అలాంటి రాష్ట్రాన్ని విడదీసేప్పుడు ఆచరించాల్సిన పద్ధతి ఇదేనా? 70 శాతం మంది ప్రజలు వీధులకెక్కి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నా దానిని అర్థం చేసుకోవడంలేదు. ఓట్ల కోసం, సీట్ల కోసం విభజించటం దురదృష్టకరమని మంత్రుల బృందానికి చెప్పామని తెలిపారు.












Click it and Unblock the Notifications