'రైతుల త్యాగ ఫలమే అమరావతి', వంటలను రుచి చూసిన మంత్రులు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. మంగళవారం రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల త్యాగంతోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందే రాజధాని నిర్మాణం సాధ్యమవుతోందన్నారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు దేశ విదేశాల నుంచి రాయబారులు, ప్రముఖులు వస్తున్నారని, అందుకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.
వీఐపీలతో సమానంగా రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. అంతక ముందు మధ్యాహ్నాం విజయవాడలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మన నీరు-మన మట్టి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద్భంగా జర్నలిస్టులు 13 జిల్లాల నుంచి సేకరించిన మట్టి-నీరుని స్పీకర్కు అందజేశారు.

అమరావతి వంటలను రుచిచూసిన మంత్రులు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు సంబంధించిన వంటల ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. వంటల ఏర్పాట్లు జరుగుతున్న చోటుకు మంగళవారం మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, కిమిడి మృణాళిని వెళ్లారు. ఈ సందర్భంగా వంటల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని నిర్వాహకులకు సూచించారు.
వంటవారు వడ్డించిన ఆహార పదార్ధాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, పనివాళ్లతో కలిసి మంత్రులు మధ్యాహ్నాం భోజనం చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే ప్రముఖులను దృష్టిలో పెట్టుకుని వంటలను మూడు విభాగాలుగా విభజించారు.
21వ తేదీ అర్థరాత్రి నుంచి వంట ఏర్పాట్లు మొదలవుతాయి. రైతులు, సాధారణ ప్రజలకు కలిపి లక్షన్నర మందికి వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.60 చొప్పున దీనికి ఖర్చు చేస్తున్నారు. 22న ఉదయం నుంచే ప్యాకింగ్ చేసి శంకుస్థాపన ప్రాంతానికి తీసుకెళ్తారు. 400 మందికి పైగా వంటవారిని, 200 మంది ప్యాకింగ్ బోయ్స్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసింది: కేంద్ర మంత్రి వెంకయ్య
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశంపై ఎందుకు చట్టభద్దత కల్పించలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ఏపీ ప్రజలను విస్మరించిందని మండిపడ్డారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందని ఆరోపించారు. ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications