జగన్కు కాంగ్రెస్ జత, బాబు వ్యూహం: ఆత్మరక్షణలో బీజేపీ, మోడీకి భయమా?
విజయవాడ: ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ ఇరుకున పడింది. బీజేపీ ఇరుకున పడటంతో మిత్రపక్షమైన టిడిపి దాని నుంచి తప్పించుకునేందుకు తన వంతుగా రంగంలోకి దిగింది. ఏపీ సీఎం చంద్రబాబు సహా టిడిపి సీనియర్ నేతలు, మంత్రులు బీజేపీకి ఏకంగా అల్టిమేటమే జారీ చేస్తున్నారు.
తమకు ఏపీ ప్రయోజనాలు, ప్రజలు ముఖ్యమని, అవసరమైతే ఎన్డీయే నుంచి వైదొలగుతామని సంచలన ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు, ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి.
హోదా పైన కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయని నేపథ్యంలో రేపు (మంగళవారం) ఏపీ బందుకు వైసిపి పిలుపునిచ్చింది. వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రేపటి బందుకు మద్దతు పలికిందని చెప్పవచ్చు.

రేపు బందుకు ఆ పార్డీ కూడా సోమవారం సాయంత్రం పిలుపునిచ్చింది. అలాగే, వరుస ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నెల 3వ తేదీన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజుల ఇళ్ల ముందు చీపురుతో ఊడ్చి నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
ప్రత్యేక హోదా పైన 4వ తేదీన ఢిల్లీలో రాజ్యాంగ నిపుణులతో సమావేశం నిర్వహించనుంది. 4వ తేదీన సాయంత్రం కాగడాలతో నిరసన తెలపనున్నారు. ప్రత్యేక హోదా పైన టిడిపి వర్సెస్ బీజేపీ, అలాగే, ఆ రెండు పార్టీల పైన విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
హోదాపై రాజకీయ నాయకుల మధ్య రెండు రోజులుగా మాటలు తూటాలు పేలుతున్నాయి. కేంద్రాన్ని గట్టిగా నిలదీయకపోవడంవల్లే ఈ అంశాన్ని నానుస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైసీపీ విమర్శించింది.
మరోవైపు, హోదా కోసం రాజీ పడే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తోంది. అవసరమైతే కేంద్రం నుంచి బయటకు వస్తామని చెబుతున్నారు.
కాగా, సోమవారం ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... బిజెపి చేతులెత్తేసిందని, దానికి టిడిపి తోడయిందన్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. మరోవైపు వైసిపి నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... హోదాపై చిత్తశుద్ధి లేకుండా ఇదేమీ సంజీవని కాదని, దీంతో అన్ని అవసరాలు తీరిపోవని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని టిడిపిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
విపక్షాలకు గట్టిగా సమాధానమిస్తూనే, బీజేపీ పైన టిడిపి మండిపడుతోంది. విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి, సహకరించిన వైసిపికి టిిపి గురించి మాట్లాడే హక్కు లేదని, తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, అవసరమైతే బీజేపీకి రాం రాం చెబుతామంటున్నారు. అయితే, బీజేపీ మాత్రం అన్ని పార్టీల వ్యూహాలను పరిశీలిస్తోంది. అయితే, చంద్రబాబు హెచ్చరికలతో మాత్రం ఒకింత తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications