ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం: రెండ్రోజుల్లో నోటిఫికేషన్! కొత్తగా ఎన్ని జిల్లాలంటే..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి లోక్సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు అడుగులు వేస్తున్నారు.
ఏపీలో కొత్తగా 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను మొత్తం 26 కొత్త జిల్లాలుగా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రేపు (మంగళవారం) లేదా బుధవారం నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.
ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా..
ప్రతి లోక్సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హామీని నెరవేర్చే దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్యాచరణ ప్రారంభించారు. ఎట్టకేలకు ఈ ఎన్నికల హామీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. మరో రెండురోజుల్లో నోటీఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అరకును రెండు జిల్లాలుగా..
రాష్ట్రంలో మొత్తంగా 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 26 కొత్త జిల్లాలు ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ భౌగోళిక రిత్యా చాలా విశాలమైనది. అందుకే ఈ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మార్పులు- చేర్పులు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఏపీలో ఇక 26 జిల్లాలు?
స్థానిక అధికార వైసీపీ నేతల అభిప్రాయాలు.. అధికారుల నివేదికలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఫైనల్గా 26 జిల్లాలు ఉండేలా కసరత్తు చేసినట్టు సమాచారం. గతంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై స్టేట్ లెవల్ కమిటీ, సబ్ కమటీలు, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. ఆయా కమిటీలు కొత్త జిల్లాలపై సమావేశాలను నిర్వహించాయి. ఆ నివేదికల ఆధారంగానే జగన్ సర్కార్ 26 కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలంటే.. ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఈ ప్రక్రియకు అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. ఇప్పటికే పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.