ఏపీలో డ్రగ్స్ మాఫియా... నిషేధిత 'ఓపీఎం పాపీ' సాగు బట్టబయలు... బెంగళూరు ముఠా పనే..?
నిషేధిత మత్తు పదార్థాల్లో ఉపయోగించే ఓపీఎం పాపీ పంటను ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుగా సాగు చేస్తున్నారు. కొంతమంది అమాయక రైతులతో బెంగళూరు ముఠాకు చెందిన కొంతమంది ఏజెంట్లు అక్రమంగా దీన్ని సాగు చేయిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి,చౌడేపల్లి తదితర మండలాల్లో ఈ పంటను సాగు చేస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ అధికారులు... సోమవారం(మార్చి 15) దాడులు నిర్వహించారు. ఆయా ప్రధాన పంటల మధ్యలో అంతరపంటగా దీన్ని సాగుచేస్తున్నట్లు గుర్తించారు. ఈ దందా వెనుక ఎవరెవరు ఉన్నారు... ఇవి ఎక్కడికి సప్లై చేస్తున్నారన్న దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు.

ఆ ప్రధాన పంటల్లో అంతరపంటగా...
మదనపల్లె శివారులో 10 సెంట్ల విస్తీర్ణంలో కోతకు సిద్దంగా ఉన్న ఓపీఎం పాపీ పంటను అధికారులు తగలబెట్టారు.మదనపల్లె,చౌడేపల్లి ప్రాంతాల్లో ఓపీఎం పాపీని సాగుచేస్తున్న ముగ్గురు రైతులను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాన్సెన్స్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అల్ల నేరెడు,మొక్కజొన్న,టమాటో పంటల మధ్యలో అంతరపంటగా దీన్ని సాగుచేస్తున్నట్లు గుర్తించారు.అయితే ఇది నిషేధిత పంట అన్న విషయం తమకు తెలియదని రైతులు వాపోతున్నారు.

ఓపీఎం పాపీ జిగురుతో డ్రగ్స్...
ఓపీఎం పాపీ సాగుపై భారత్లో నిషేధం ఉంది.దేశంలో ఎవరైనా ఎక్కడైనా అనుమతి లేకుండా ఓపీఎం పాపీ సాగుచేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా తీవ్రమైన నేరం కిందకు వస్తుంది. కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతులున్న రాష్ట్రాల్లో మాత్రమే వైద్యపరమైన మత్తు మందుల తయారీ కోసం దీన్ని సాగుచేస్తారు. సాధారణంగా ఓపీఎం పాపీ మొక్క నుంచి గసగసాలతో పాటు దాని బెరడు నుంచి ఒకరకమైన జిగురు పదార్థం ఉత్పత్తి అవుతుంది. చెట్టు బెరడుపై బ్లేడుతో కాట్లు పెట్టడం ద్వారా ఈ జిగురు బయటకొస్తుంది. దీన్ని సేకరించి కొకైన్,హెరాయిన్ తదితర మత్తు పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు.

అంతర్జాతీయ ముఠాతో లింకులు?
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఓ ముఠా రైతులతో ఈ పంటను సాగు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడినుంచి విత్తనాలు సప్లై చేసి... పంట కోతకు వచ్చాక గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడినుంచి తరలిస్తున్నట్లు భావిస్తున్నారు. స్థానికంగా కొన్ని ఇళ్లల్లో పెద్ద గ్రౌండర్లతో ఓపీఎం పాపీ బెరడును పౌడర్గా మార్చి తరలిస్తున్నట్లు కూడా అనుమానిస్తున్నారు. బెంగళూరులోని ఆ ముఠాను పట్టుకునేందుకు అధికారులు,పోలీసులు కూపీ లాగుతున్నారు. దీని వెనకాల అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకులు ఉన్నాయా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications