రైతులకు ఏపీ తీపీ, కానీ: జపాన్లో చంద్రబాబు బిజీబిజీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు రాష్ట్ర రైతులకు రుణమాఫీ అమలు చేయనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన నుండి తిరిగి వచ్చాక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి తొలి దశ రుణమాఫీని నేరుగా రైతుల ఖాతాల్లో వేయనున్నారు.
31 లక్షల మంది రైతులకు రుణమాఫీ తొలి దశ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల్లో సగం మందికి పైగా తొలిదశలో రుణమాఫీ చేయనున్నారు. మిగతా వాటిలో ఇరవై లక్షల ఖాతాలను వడపోస్తారు. అనంతరం వారికి రుణమాఫీ వర్తిస్తుంది. అయితే, ఇందులో ఓ మెలిక ఉంది! కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ వర్తించనుందని తెలుస్తోంది.
జపాన్ పర్యటనలో బాబు బిజీ
జపాన్ దేశంలో ఉన్న చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. సోమవారం అక్కడ ఎన్మార్ అగ్రికల్చర్ మిషనరీ ఎండీతో ఆయన సమావేశం అయ్యారు. వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు కావాల్సిన పనిముట్లపై చర్చించారు. ఆ తర్వాత ఎన్ఐడీఈసీ ఛైర్మన్ నగమోరితో సమావేశమయ్యారు.
ఇక్రిశాట్తో కలిసి ప్రభుత్వం చేపట్టే చర్యలను ఎన్మార్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. అనంతరం వారిని రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆధునిక సాగు యంత్రాల పరిశ్రమను ఏపీలో స్థాపించాలని కోరారు. కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ రెండుచోట్ల మంచి ప్రభుత్వాలు ఉన్నాయని, కేంద్రంలో మోడీ నాయకత్వంలో దేశం గొప్పగా అభివృద్ధి చెందుతుందన్నారు.
పరిశ్రమల స్థాపనతో ఆసియాలోనే ఎక్కువగా వ్యాపారంచేసే అవకాశం ఉంటుందని, వ్యాపార విస్తృతికి రాష్ట్రంలోని పోర్టులు దోహదం చేస్తాయని చంద్రబాబు చెప్పారు. ఏకగవాక్ష పద్ధతిలో అన్ని అనుమతులు వెంటనే మంజూరు చేస్తామన్నారు. నిరంతర విద్యుత్ ఇస్తామన్నారు.
తమ వద్ద నైపుణ్యం కల శ్రామిక శక్తి ఉందని, పెట్టుబడులకు ఏపీ అనుకూల ప్రాంతమన్నారు. ఎన్ఐడీఈసీ ప్రతినిధులకు చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తానని ఎస్మార్ ఎండీ నగమోరి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.