షాక్: ఐఎస్ఐఎస్ వీడియోలో ఏపీ యువకుడు, భారత్కు హెచ్చరిక
విజయవాడ: అమెరికాలో విద్యనభ్యసిస్తున్న భారత విద్యార్థులపై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు భారతీయులు ఆ సంస్థ పట్ల ఆకర్షితులై చేరిపోతున్నారు. ఆందోళనకలిగించే విషయమేమిటంటే.. భారత్పై ప్రతీకార దాడులు చేస్తామంటూ.. ఇటీవల ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విడుదల చేసిన వీడియోలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు నిఘా వర్గాలు, దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
టెక్సాస్లో ఇంజినీరింగ్ చదువుతూ.. సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్లో చేరిన ఆ యువకుడు గుంటూరు జిల్లాకు చెందిన తల్మీజుర్ రెహమాన్గా భావిస్తున్నారు. రెహమాన్ కుటుంబం చాలా ఏళ్ల కిందటే గుంటూరు నుంచి హైదరాబాద్కు అక్కడి నుంచి కువైట్కు వెళ్లి స్థిరపడింది.

అనంతరం టెక్సాస్లో ఇంజినీరింగ్ చదివేందుకు వెళ్లిన రెహమాన్.. ఈ క్రమంలోనే ఐఎస్ఐఎస్ సిద్ధాంతాలకు, భావజాలానికి ఆకర్షితుడై 2014లో అదృశ్యమయ్యాడు. కొన్ని నెలల తర్వాత అతని పేరు ఐఎస్ఐఎస్ డాక్యుమెంటులో దర్శనమిచ్చింది. అతని ఫైటింగ్ నేమ్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ తన డాక్యుమెంటులో అబు సల్మన్ అల్ హిందీగా పేర్కొంది.
కాగా, గత కొంతకాలంగా ఐఎస్ఐఎస్ కార్యకలాపాల్లో రెహమాన్ చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. 4నెలల కిందట జరిగిన ఓ ఘటనలో రెహమాన్ మృతిచెందాడన్న వార్తలు అప్పట్లో వెలువడ్డాయి.
అయితే బాబ్రీ మసీదు కూల్చివేత సహా మరికొన్ని ఘటనలకు సంబంధించి భారతదేశంపై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామంటూ.. ఈ ఏడాది మే 19వ తేదీన ఐఎస్ఐఎస్ సంస్థ విడుదల చేసిన వీడియోలో భారత్కు చెందిన ఆరుగురు వ్యక్తులున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ, నిఘా వర్గాలు గుర్తించాయి.
వారిలో కొందరు ఉత్తరప్రదేశ్, మరికొందరు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కూడా ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఆ విద్యార్థి తల్మిజర్ రెహమాన్ అయి ఉంటాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటి వరకూ దర్యాప్తు సంస్థలు వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications