ఎన్నికల యుద్ధానికి తెరతీసిన జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల యుద్ధానికి తెరతీశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఆచి తూచి అడుగులు వేస్తున్న జగన్ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. రెండు నెలలుగా ముఖ్యమంత్రి కార్యక్రమాలను పరిశీలిస్తే ఆయన జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లు అర్థమవుతుంది.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా
తాను రాజకీయం చేయనని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, తన నిబద్ధతను, నిజాయితీని, చిత్తశుద్ధిని గమనించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబునాయుడి హయాంలో ఇబ్బందులు పడినవారి గురించి ఆయన అనుకూల మీడియా ఎందుకు రాయడంలేదని, తన పాలనమీద రాంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇవన్నీ ప్రజలు జాగ్రత్తగా పరిశీలించాలని కోరుతున్నారు. చంద్రబాబు ఏంచేసినా కిమ్మనని ఆయన మీడియా దుష్టచతుష్టయంగా మారి తనపై బురద జల్లుతోందని, దానివెనక వారి స్వార్థప్రయోజనాలున్నాయనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నారు.
పవన్కల్యాణ్ పేరెత్తకుండానే
జనసేనాని పవన్కల్యాణ్ పేరెత్తకుండా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ జగన్ విమర్శల్లో వేడిని పెంచారు. కౌలురైతులకు నష్టపరిహారం పేరుతో పవన్కల్యాణ్ జిల్లాల పర్యటన చేస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు రైతుల రుణామీఫీ చేయకపోతే ఆనాడు ఆయన దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తెరగాలని జగన్ అంటున్నారు.
అందరూ చంద్రబాబు కోసమే
పవన్కల్యాణ్, ఆయన అనుకూల మీడియా అందరూ ఒక్కటేనని, వీరంతా చంద్రబాబునాయుడు కోసం పనిచేస్తున్నారనే విషయాన్ని ఆయన ప్రజల మనసుల్లోకి చొప్పిస్తున్నారు. తనకు రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ఎన్నికల కోసం ఎదురు చూసే మనస్తత్వం తనకు లేదంటున్నారు.
నేను చిత్తశుద్ధితో ఉన్నాను
ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా, ఏ సభలో పాల్గొన్నా జగన్మోహన్రెడ్డి చెబుతున్నది ఒకటే మాట. తాను చిత్తశుద్ధితో ఉన్నానని, నిజాయితీగా పరిపాలన చేస్తున్నానని, అందరూ తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. ఇవన్నీ గమనిస్తున్న సీనియర్ రాజకీయ వేత్తలు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్ధానికి తెరతీశారని, ఒక ప్రణాళిక ప్రకారమే ఆయన పర్యటనలు కూడా ఉంటున్నాయని, ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.