ఏపీలో పర్యాటక పోలీస్.. డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్ వెనుక..
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త కార్యాచరణను ముందుకు తెచ్చారు. పర్యాటకులకు పూర్తి భద్రత, రక్షణ కల్పించేందుకు ప్రత్యేక 'పర్యాటక పోలీసు' వ్యవస్థను ఏపీలో తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు సచివాలయంలో పర్యాటకం, అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎకో టూరిజం ప్రాజెక్టుల వేగవంతం
పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం లక్ష్యంగా ఎకో టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ కార్యక్రమాల ద్వారా సుమారు 50 వేల మంది యువకులకు ఉద్యోగాలు అందించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న హోమ్ స్టే మోడల్ను ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో కూడా అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

200 ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించి ఐదురోజుల్లో నివేదిక
పర్యాటక భద్రత, అభివృద్ధి అంశాలపై నాలుగు శాఖలతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని 200 ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించి ఐదు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా త్వరలోనే క్యాబినెట్లో చర్చించి, పర్యాటక పోలీసు వ్యవస్థను అమలు చేయనున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో వన్య ప్రాణులు, పక్షుల సంరక్షణా కేంద్రాలు
కర్నూలు జిల్లాలోని కృష్ణ జింకలు, నల్లమల అడవుల్లో బైర్లూటి, నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో పక్షుల సంరక్షణ కేంద్రాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటకుల సౌకర్యార్థం రూట్ మ్యాప్లు, వసతి సదుపాయాల వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని ఆదేశించారు. దేవాలయాలను కేంద్రంగా చేసుకుని సమీప ప్రకృతి ప్రాంతాలను కలుపుతూ కొత్త కాంబో టూర్ ప్యాకేజీలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
అటవీ మరియు పర్యాటక శాఖల మధ్య అవగాహనా ఒప్పందం
జూన్ 10వ తేదీలోగా అటవీ మరియు పర్యాటక శాఖల మధ్య అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలని గడువు విధించారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్, స్వదేశ్ దర్శన్, సాస్కీ వంటి వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందన్నారు. అన్నవరం, గండికోట, అఖండ గోదావరి, అరకు, సూర్యలంక బీచ్, అహోబిలం, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించినట్టు తెలిపారు.
ఏపీని పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానంగా మార్చేలా పవన్ ప్లాన్
ఈ కొత్త ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ఈ ప్రణాళికలు ఏపీని పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications