Digvijay Singh : రాష్ట్ర విభజనతో ఏపీకి గాయం-అంగీకరిస్తున్నాం-దిగ్విజయ్ సింగ్ కామెంట్స్
2014లో ఏపీ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఆ పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. రాష్ట్రంలో ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు ప్రజాప్రతినిధులే కరువయ్యారు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్లు కోల్పోవడం మినహా కాంగ్రెస్ గట్టెక్కింది లేదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరు ముమ్మరం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
బీజేపీ విద్వేష విధానాలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ.. త్వరలో ఏపీలో పర్యటించబోతున్నారు. ఏపీలో జరిగే భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ కర్నూలు జిల్లా గుండా వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కర్నూలు వచ్చిన కాంగ్రెస్ నేతలు రూట్ మ్యాప్, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2014లో రాష్ట్ర విభజనతో ఏపీకి గాయమైందని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. అయితే త్వరలో లోపాల్ని సరిదిద్దుకుని ఏపీలో బలపడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ యాత్రతో బీజేపీ, ఆరెస్సెస్ లో అప్పుడే భయం మొదలైందన్నారు. భారత్ లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతోందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. వీటిని ఎదుర్కొనే ఉపాయం బీజేపీ వద్ద లేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు.