వేగవంతం: పొడిగింపుకు లేదు, జూన్ 2నే కొత్త రాష్ట్రాలు
హైదరాబాద్: విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని, రాత్రింబవళ్లు పని చేసి జూన్ 2నాటికి కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యేలా ఉండాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వ కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో జూన్ 1వ తేదీ నాటికి విభజన ప్రక్రియ పూర్తయి, మరుసటి రోజు రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని, గడువు పొడగించే ప్రసక్తి లేదని చెప్పారు.
విభజన ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేస్తామని గోస్వామికి పికె మహంతి హామీ ఇచ్చారు. విభజన, పంపకాలకు సంబంధించిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. విభజన ప్రక్రియపై మంగళవారం సచివాలయంలో అనిల్ గోస్వామి సమీక్ష చేశారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉదయమే నగరానికి చేరుకున్న అనిల్ గోస్వామి, కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, జాయింట్ సెక్రటరీ సురేష్ కుమార్తో సిఎస్ మహంతి, పలువురు ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు భేటీ అయ్యారు. అపాయింటెడ్ డే అయిన జూన్ రెండులోగా రాష్ట్ర విభజన జరగాల్సి ఉన్నందున, తాము ఏప్రిల్లో నివేదిక సమర్పిస్తే కేంద్రం తన వంతు పనిని పూర్తి చేయడానికి మరో నెల సమయం ఉంటుందని సిఎస్ ఈ సమావేశంలో వివరించారు.

ఉద్యోగులు, అఖిల భారత సర్వీసుల అధికారుల పంపిణీపై రిటైర్డ్ ఐఏఎస్ కమలనాథన్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శామ్యూల్తో కమిటీలు నియమించామన్నారు. ఫైళ్ల రికార్డులు, ఆస్తులు, అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగులు తదితర అంశాలన్నింటినీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం ఇరు రాష్ట్రాలకు పంపిణీ చే స్తామని ఆయన తెలియజేశారు. ఈ క్రమంలో ఎదుర్కొంటున్న సమస్యలను అనిల్ గోస్వామికి చెప్పారు.
సబ్ కమిటీలకు అప్పగించిన పనుల పరిస్థితిపై ఆయా కమిటీల కార్యదర్శులు ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. ఏప్రిల్ నాటికి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నందున ఆ లోపు పన్నుల వసూళ్లు, ట్రెజరీల విభజన పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అయితే నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయలేకపోతే ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపైనా ఆలోచించాలని అనిల్ గోస్వామి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ప్రతి కమిటీతోనూ ఆయన మాట్లాడారు.
ఇరు రాష్ట్రాల్లోని ప్రజలకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా అందరికీ మేలు జరిగేలా విభజన, పంపకాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆర్బీఐలో ప్రత్యేక ఖాతాను తెరవనున్నారు. ఇప్పుడున్న ఉమ్మడి రాష్ట్ర ఖాతాను ఆంధ్రపదేశ్కు కేటాయించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఎక్కడవక్కడే ఉంచాలని నిర్ణయించారు.
మంగళవారం జరిగిన సమీక్షలో ప్రాధాన్యతలవారీగా ముందుగా పూర్తి చేయాల్సిన అంశాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వివరించారు. ఫైళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్ల కంప్యూటరీకరణ పూర్తి చేసి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల విభజనను రెండో ప్రాధాన్యతగా ఎంచుకున్నారు. రెండు రాష్ట్రాలకు వసతుల సదుపాయంలో భాగంగా జనాభా ప్రాతిపదికన ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్, కార్యాలయాలు, అతిథి గృహాలను కేటాయించాలని, సంచిత నిధిని కూడా జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications