అనిత టార్గెట్ రోజా: కాల్ మనీనీ బయటపెట్టిందే మా ఎంపీ: బోడె షాకింగ్
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారం ఏపీ శాసన సభలో శుక్రవారం వేడిని రాజేసింది. ఎమ్మెల్యే వంగలపూడి వనిత మాట్లాడుతూ... వైసిపి మహిళా సభ్యురాలు రోజా ముఖ్యమంత్రి వద్దకు వచ్చి అనుచితంగా వ్యవహరించారని, ఆమె పైన కనీసం 6 నెలల నుంచి ఏడాది వరకు సస్పెన్షన్ వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
కాల్ మనీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసిపిపై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాను సస్పెండ్ చేయాలన్నారు. గతంలో ఇలాగే సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. వంగలపూడి వనిత శాసన సభలో మాట్లాడారు. అనంతరం సభలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.
విదేశాల్లో విమానాలు కూలినా బాబే బాధ్యుడా: బోడె ప్రసాద్
విదేశాల్లో కూలిపోయిన విమానాలకు, తీవ్రవాదుల దాడులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబేనని ప్రతిపక్ష నేత జగన్ చెప్పేలా ఉన్నారని బోడె ప్రసాద్ మండిపడ్డారు. ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాల్ మనీ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది తమ పార్టీకి చెందిన ఎంపీ (కేశినేని నాని) అని, చర్యలు తీసుకోవాలని చెప్పింది సీఎం చంద్రబాబు అన్నారు.
అలాంటప్పుడు మేం కాల్ మనీలో ఎందుకు ఉంటామని చెప్పారు. నేను నా కుటుంబంతో విదేశాల్లో ఉంటే, మార్ఫింగ్ చేసి తాను విదేశాల్లో జల్సాలు చేస్తున్నట్లు వైసిపి ఆరోపించిందని, ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా అన్నారు. మిత్రుడితో విదేశాలకు వెళ్తే ఆరోపణలా అన్నారు.
కాల్ మనీలో తన పెట్టుబడులు ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారని, కానీ నేనే అప్పు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నానని చెప్పారు. నా వద్ద డబ్బులు ఉంటే బ్యాంకు నుంచి అప్పులు తీసుకోకపోయేవాడిని అన్నారు. ప్రతిపక్ష నేత కాల్ మనీ పైన కనీసం ఫిర్యాదు చేయలదేన్నారు.
చికాగో వర్సిటీ చంద్రబాబుకు డాక్టరేట్ ఇచ్చిందని, జగన్కు ఇవ్వాల్సి వస్తే అవినీతిలో డాక్టరేట్ ఇవ్వొచ్చన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి నా బిడ్డలాంటి వాడని, మంగలి కృష్ణ తనకు సోదరుడి లాంటి వాడని గతంలో వైయస్ చెప్పారని, కానీ ఇప్పుడు తాను నిందితులతో కలిసినట్లు ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.