పేరు మార్పు ఖాయమా? అన్న క్యాంటీన్లు..ఇక రాజన్న క్యాంటీన్లు:
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ల రూపురేఖలు మారుతున్నాయి. వాటిని రాజన్న క్యాంటీన్లుగా నామకరణం చేయనుంది కొత్త ప్రభుత్వం. అలాగే- అన్న క్యాంటీన్లకు వేసిన పసుపురంగు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకంలో ఉన్న రంగులను వేస్తున్నారు. కొన్ని చోట్ల ఈ పనులు ఇప్పటిక మొదలయ్యాయి కూడా.
కాంగ్రెస్ పక్షులన్నీ సొంత గూటికి?
ప్రభుత్వాలు మారిన ప్రతీసారి పేర్ల మార్పు సహజమే. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి ఎన్టీఆర్ పేరును పెట్టిన విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ లేదా కాంగ్రెస్ పెద్దల పేర్లతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు చంద్రబాబు పేర్లను మార్చారు. ఎన్టీఆర్, లేదా తన పేరును పెట్టుకున్నారు. చంద్రన్న కానుక అంటూ వాటిని అమలు చేశారు.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ఇక తన తండ్రి హయాంలో ఆరంభమైన పథకాలతో పాటు- తెలుగుదేశం పార్టీ అమలు చేసిన అన్నక్యాంటీన్ల వంటి ఒకటి, అరా పథకాలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెట్టబోతున్నారు. అన్న క్యాంటీన్కు రాజన్న క్యాంటీన్ అని పేరు పెట్టి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని తగిలించిన ఈ ఫొటో ఎక్కడిదో తెలియట్లేదు గానీ.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.