జయలలిత దారిలో చంద్రబాబు: త్వరలో అన్న సంజీవిని ఫుడ్ క్యాంటిన్లు
విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటిన్ల మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో అన్న సంజీవినీ ఫుడ్ క్యాంటిన్లు తెరుచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే అన్న సంజీవని ఫుడ్ క్యాంటిన్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
2019 నాటికి డ్వాక్రా మహిళలు వంద శాతం అక్షరాస్యత సాధించాలని చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం గ్రామీణాభివృద్ధిశాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - డ్వాక్రా మహిళలు నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. నాలుగేళ్లలో నెలవారీ ఆదాయం రూ.పది వేలకు పెరగాలన్నారు. ప్రతి ఇంట్లో ఒక మహిళ ఈ-లిటరేట్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు.
త్వరలో అక్షర వెలుగు లేదా అక్షర సంక్రాంతి పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళలు తమ ఉత్పత్తులను ఆన్లైన్ విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టెక్స్టైల్స్, గొర్రెల పెంపకం, జీవనధార, క్యాంటీన్ల నిర్వహణతో మహిళా సంఘాల ఆదాయం పెంచుతామని చంద్రబాబునాయుడు వెల్లడించారు.
సర్పంచ్ల పనితీరు బాగుంటే దేశ ప్రగతి కనిపిస్తుందని కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు అన్నారు. సోమవారం నీటి వినియోగంపై సర్పంచ్,ఎంపీటీసీలకు ఇస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలన్నారు.అందువల్ల గ్రామాలు సుభిక్షంగా ఉంటే దేశం ప్రగతి పథంలో ప్రయాణిస్తుందని అశోక్గజపతిరాజు చెప్పారు.