తిరుమల శ్రీవారి ఆలయంలో అవి ఉండవ్
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 82,367 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,420 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.28 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు రేపు సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. ఈ కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. 5వ తేదీన పవిత్రాల ప్రతిష్ట, 6న పవిత్ర సమర్పణ, 7న పూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
ఆర్జితసేవలు రద్దు..
పవిత్రోత్సవాల అంకురార్పణ కారణంగా 4వ తేదీన సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్ధు చేసింది. అదేవిధంగా.. 5న అష్టదళ పాద పద్మారాధన సేవ, 7న తిరుప్పావడ సేవలు రద్దయ్యాయి. దీనితో పాటు 5 నుండి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications