హైదరాబాద్ నుంచి తిరుపతికి సిద్ధమవుతున్న మరో రైలు మార్గం
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాలంటే వరంగల్, కాజీపేట, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ఒక మార్గం ఉంది. ఈ మార్గంతోపాటు మరోమార్గం కూడా ఉంది. బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలిమీదుగా మరో మార్గం, కాచిగూడ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, గుత్తి, తాడిపత్రి, యర్రగుండ్ల, కడప, రేణిగుంటమీదుగా మరో మార్గం ఉంది. ఇవి కాకుండా మరో మార్గం సిద్ధమవుతోంది. విజయవాడ-చెన్నై, విజయవాడ-తిరుపతి మార్గంలో భారీ వర్షాలు కురిసినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైళ్లను నడపడం చాలా కష్టమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్రమట్టి నేలపై, ప్రకృతి విపత్తులు తట్టుకునేలా మరో మార్గాన్ని భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది.
పొదిలి వరకు రైళ్లు నడపాలని కోరుతున్న స్థానికులు
ప్రస్తుతం పనులు జరుగుతున్న ఈ మార్గం నడికుడి-శ్రీకాళహస్తి. హైదరాబాద్-గుంటూరు మార్గంలో ఇది ప్రధాన జంక్షన్. నడికుడి నుంచి మాచర్ల చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. నడికుడి నుంచి పిడుగురాళ్ల, వినుకొండ, శావల్యాపురం దర్శి, అద్దంకి, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంకటగిరి మీదుగా వెళ్లి శ్రీకాళహస్తి దగ్గర ప్రధాన లైనుకు కలుస్తుంది. ప్రస్తుతం కనిగిరి వరకు కొత్త రైల్వేస్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దర్శిలో పూర్తయింది. అక్కడ గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను ట్రయల్ రన్ గా నడిపించి చూశారు. ప్రస్తుతం నడికుడి నుంచి దర్శి, పొదిలి వరకు రైళ్లను నడపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

దర్శిలో రెండో భవన నిర్మాణం
దర్శి రైల్వేస్టేషన్ లో రెండో భవనం నిర్మాణ పనులు, అలాగే పొదిలి రైల్వేస్టేషన్ నిర్మాణ పనులతోపాటు కనిగిరి లైన్ పనులు కూడా జరుగుతున్నాయి. దీంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ మార్గాన్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. తిరుపతి వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే తమకు బస్సు తప్పితే మరో మార్గం లేదని, అధిక ఛార్జీల భారం ఉంటుందని, రైల్వే లైను అందుబాటులోకి వస్తే తక్కు ఖర్చుతో స్వామిని దర్శించుకోవచ్చంటున్నారు. మొత్తం 309 కిలోమీటర్ల నిర్మిస్తున్న ఈ రైల్వే లైను ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.2400 కోట్లుగా ఉంది.












Click it and Unblock the Notifications